బంగారం లాంటి అవకాశం… గుర్తించని చంద్రబాబు

రాజ‌కీయ రాజ‌ధానిగా పేరున్న విజ‌య‌వాడలో టీడీపీ పుంజుకునేందుకు ఎంతో ఎడ్జ్ ఉంది. అంతేకాదు.. విజ‌య‌వాడ‌కు స‌మీపంలోనే పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నివాసం కూడా ఉంటున్నారు. అయితే.. ఇక్క‌డ జ‌రుగుతున్న రాజ‌కీయాల‌ను ఆయ‌న లైట్ తీసుకుంటున్నారో.. లేక .. మీడియా ముందుకు వ‌చ్చి హడావుడి చేసే వారితోనే పార్టీ మ‌నుగ‌డ సాగిస్తుంద‌ని అనుకుంటున్నారో.. ఎవ‌రికీ తెలియ‌డం లేదు. దీంతో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. ఒక‌ప్పుడు విజ‌య‌వాడ‌లో టీడీపీ పుంజుకునే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. అటు కాంగ్రెస్‌, ఇటు వామ‌ప‌క్షాలు బ‌లంగా ఉండేవి.

అయితే.. కాల‌క్ర‌మంలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. కాంగ్రెస్ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న‌వారు ఎవ‌రు అంటే.. వేళ్ల‌పై లెక్క‌పెట్టుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదేస‌మ‌యంలో క‌మ్యూనిస్టులు కూడా ప్రాభ‌వం కోల్పోయారు. ఎప్పుడూ.. కార్పొరేష‌న్‌లో ప‌ది నుంచి 15 మంది స‌భ్యుల‌ను నెగ్గించుకునే క‌మ్యూనిస్టులు.. ఈ ద‌ఫా ఒక్క‌రు ఇద్ద‌రితోనే స‌రిపెట్టుకున్నారు. కాంగ్రెస్ ఉనికి కూడా క‌నిపించ‌డం లేదు. ఇక‌, అధికార ప‌క్షం వైసీపీ కూడా వ‌ర్గ పోరుతో అల్లాడుతోంది. మా ప‌రిధిలోకి రావ‌ద్దంటే.. మా ప‌రిధిలోకి రావ‌ద్దంటూ.. నాయ‌కులు గీత‌లు గీసుకున్నారు.

దీంతో టీడీపీకి ఎదిగేందుకు ఎంతో స్కోప్ ఉంది. అయితే.. ప్ర‌జాబ‌లం ఉన్న నాయ‌కులు పార్టీకి దూరం అవుతుండ‌డమే ఇప్పుడు ప్ర‌ధాన మైన‌స్‌గా మారిపోయింది. అదేస‌మ‌యంలో మీడియా ముందు గొంతేసుకుని అరిచే.. వారు..ప్ర‌జ‌ల్లో స‌త్తాలేని వారు మాత్రం పార్టీని న‌డిపిస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇది పార్టీకి ప్ల‌స్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. వారు మీడియా నాయ‌కులే త‌ప్ప‌.. ప్ర‌జానాయ‌కులు ఎంత మాత్రం కాద‌నే విష‌యం సుస్ప‌ష్టం. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ కూడా వీరి దెబ్బ‌తో.. మౌనం పాటిస్తున్నారు.

ఎంపీ నాని కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. మ‌రోవైపు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో పుంజుకునే కార్య‌క్ర‌మాల‌ను ప‌క్క‌న పెట్టిన ఈ మీడియాబ్యాచ్‌.. వ్య‌క్తిగ‌త గుర్తింపు కోసం.. పార్టీలో ప‌ద‌వుల కోసం .. త‌హ‌త‌హ లాడుతోంది. దీంతో.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌ను కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకునేవారు లేకుండా పోయార‌నేది కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తున్న ప్ర‌ధాన ఆరోప‌ణ‌. మ‌రోవైపు.. ప్ర‌జ‌ల్లో బ‌లం ఉన్న నాయ‌కులు కూడా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. సామాజిక స‌మీక‌ర‌ణ ప్ర‌కారం చూసుకున్నా.. ఇదే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో పార్టీని సంస్క‌రించ‌కపోతే.. క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.