షాక్ : గుర్తింపు కోల్పోయిన జనసేన !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ వార్త నిజంగా ఇబ్బందికరమైనదే. ఎందుకంటే జాతీయ పార్టీలేవి, ప్రాంతీయ పార్టీలేవి, గుర్తింపు కోల్పోయిన పార్టీలేవి అనే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఓ జాబితాను విడుదల చేసింది. ఇందులో జనసేన పార్టీని గుర్తింపు లేని రాజకీయ పార్టీగా ప్రకటించింది. పైగా ఫ్రీ సింబల్స్ లో జనసేన క్లైం చేసుకుంటున్న గాజు గ్లాసు గుర్తు ఉందని మరో ప్రకటన చేసింది. అంటే గాజు గ్లాసు గుర్తు అనేది జనసేన పార్టీకి మాత్రమే సొంతం కాదని అర్ధమవుతోంది.

రాజకీయ పార్టీలుగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గర కొన్ని నిబంధనలుంటాయి. ఆ నిబంధనల ప్రకారం పార్టీలు సాధించిన ఓట్లు, సీట్లు కమీషన్ పరిగణలోకి తీసుకుంటుంది. ఆ నిబంధనల ప్రకారం ఓట్లు, సీట్లను సాధించిన పార్టీల హోదాను బట్టి కమిషన్ జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలుగా గుర్తిస్తుంది. కమిషన్ లెక్కల ప్రకారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ మాత్రమే జాతీయ పార్టీలు.

27 రాష్ట్రాల్లో 57 ప్రాంతీయ పార్టీలున్నట్లు కమిషన్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని టీఆర్ఎస్, వైసీపీ, తెలుగుదేశం పార్టీ, ఎంఐఎంలు మాత్రమే ప్రాంతీయ పార్టీలుగా కమిషన్ ప్రకటించింది. ఇవి కాకుండా 2796 పార్టీలను గుర్తింపులేని ప్రాంతీయ పార్టీలుగా కమిషన్ ప్రకటించింది. ఇందులోనే జనసేన ఉంది. 197 గుర్తులను ఫ్రీ సింబల్స్ ను లిస్టులో ఉంచింది. ఇందులోనే జనసేన తమదిగా చెప్పుకుంటున్న గాజుగ్లాసు కూడా ఉంది. అంటే ఈ గుర్తును ఏ పార్టీ అయినా ఉపయోగించుకోవచ్చు.

నామినేషన్లు వేసినపుడు ఎవరైతే ముందుగా దాఖలు చేసి గాజు గ్లాసును ఎంపిక చేసుకుంటే వారికి ఆ గుర్తును కమిషన్ కేటాయిస్తుంది. ఈ మధ్యనే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్ధికి కమిషన్ గుర్తించిన విషయం తెలిసిందే. ఇదే విషయమై పవన్ అభ్యంతరం వ్యక్తం చేసినా కమిషన్ కొట్టేసింది. కాకపోతే అప్పుడు తాను పోటీ చేయకుండా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు.

జనసేన ఏర్పాటు చేసి ఏడేళ్ళయినా ఇంతవరకు చెప్పుకోదగ్గ సీట్లు, ఓట్లను పార్టీ సాధించలేదన్నది వాస్తవం. పార్టీ పోటీచేయటం కన్నా ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిందే ఎక్కువ. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నా అప్పటి ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కాబట్టి ఓట్లు, సీట్లనే ప్రస్తావన లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఎక్కడా పెద్ద ప్రభావం చూపలేదు. తర్వాత 2020 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చింది.

తర్వాత ఏపీ లో జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. నిజానికి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఎన్ని సీట్లు, ఓట్లు సాధించినా కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించదు. కమీషన్ లెక్కంతా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు మాత్రమే. వచ్చే ఎన్నికలో అయినా కమిషన్ గుర్తింపు పొందేందుకు అవసరమైన ఓట్లు, సీట్లు సాధిస్తుందేమో చూడాలి. ఇదంతా పవన్ వైఖరిపైనే ఆధారపడుటుంది. చూద్దాం ఏమి జరుగుతుందో.