షాక్ : ఆయన వ్యూహాల‌కు బాబు గుడ్‌బై

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిని దెబ్బ కొట్టి విజ‌యం సాధించాలంటే ఎన్నో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ స‌మ‌ర్థ‌వంత‌మైన ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తూ ముంద‌కు సాగాల్సి ఉంటుంది. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ద‌క్కించుకోవ‌డంతో పాటు ప్ర‌త్య‌ర్థి నాయ‌కుల‌కు చెక్ పెట్టేలా ప్ర‌యాణం సాగించాల్సి ఉంటుంది. అందుకే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కు ద‌క్కేలా.. ప్ర‌త్య‌ర్థి నేత‌ల‌పై పైచేయి సాధించేందుకు వీలుగా రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేకంగా వ్యూహ‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకోవ‌డం తెలిసిన సంగ‌తే. దేశంలో ప్రముఖ జ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్ కోసం పార్టీలు పోటీప‌డడం ఆ కోవాలోకే వ‌స్తుంది. అయితే అన్నిసార్లు ఈ వ్యూహ‌క‌ర్త‌లు ఇచ్చిన స‌ల‌హాలు ప‌ని చేస్తాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. కొన్నిసార్లు ఎదురుదెబ్బ‌లూ త‌గులుతాయి. గ‌త యూపీ రాష్ట్ర శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిశోర్ వ్యూహాలు కాంగ్రెస్‌కు క‌లిసి రాక‌పోవ‌డం అలాంటిదే.

ఇప్పుడిక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే.. 2019 ఎన్నిక‌ల్లో ప్రశాంత్ కిషోర్ వైసీపీ విజ‌యం కోసం ప‌నిచేశారు. ఆయ‌న వ్యూహాలను అనుస‌రించిన జ‌గ‌న్ అఖండ విజ‌యం సాధించారు. ఇక ఆ ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌ర్వాత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా త‌మ పార్టీకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త అవ‌స‌రం ఉంద‌ని భావించారు. అందుకే ప్ర‌శాంత్ కిషోర్ టీమ్‌లో ప‌నిచేసిన రాబిన్ శ‌ర్మ‌ను వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకున్నార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బాబు.. రాబిన్ శ‌ర్మ స‌హ‌కారం తీసుకుంటున్నార‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ ఆయ‌న వ్యూహాల‌కు పార్టీకి ఏ ర‌కంగానూ మేలు చేయ‌లేక‌పోతున్నాయ‌ని భావించిన బాబు.. ఇప్పుడు రాబిన్‌కు గుడ్‌బై చెప్పార‌ని స‌మాచారం. ఆయ‌న‌తో ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలిసింది.

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో టీడీపీ ఓట‌మితో రాబిన్ శ‌ర్మ‌పై బాబు న‌మ్మ‌కాన్ని కోల్పోయార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్ప‌టి నుంచి ఆయ‌న ఎత్తుగ‌డ‌లు, వ్యూహాలు త‌మ‌కు ప‌నికిరావ‌ని బాబు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా వైసీపీ నియ‌మించిన వాలంటీర్ల త‌ర‌హాలోనే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి 50 మందికి ఓ కార్య‌క‌ర్త‌ను నియ‌మించాల‌ని టీడీపీకి రాబిన్ స‌ల‌హానిచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అది సాధ్య‌ప‌డ‌లేదు. అధికార పార్టీకి ఎదురుగా నిల‌బ‌డేందుకు కార్య‌క‌ర్త‌లు ముందుకు రాక‌పోవ‌డంతో ఆ వ్యూహం విఫ‌ల‌మైంది. ఇక ఆల‌యాల‌పై దాడుల విష‌యంలోను రాబిన్ త‌న‌ను త‌ప్పుదారి ప‌ట్టించార‌నే అభిప్రాయం బాబుకు వ‌చ్చింద‌ని తెలిసింది. రామ‌తీర్థానికి నేరుగా త‌న‌నే వెళ్ల‌మ‌ని రాబిన్ చెప్ప‌డంతో అక్క‌డికి వెళ్లిన బాబుకు ఎదురైన ఘ‌ట‌న‌లు ఆయ‌న‌కు మ‌న‌స్థాపానికి గురి చేశాయ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో రాబిన్ శ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌తో చేసుకున్న ఒప్పందాన్ని బాబు ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న వ్యూహాల‌తో ముందుకు సాగాల‌ని బాబు అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. వైసీపీ త‌ర‌పున ప్ర‌శాంత్ కిషోర్ ప‌ని చేసిన‌ప్ప‌టికీ తాను మాత్రం సొంత వ్యూహాల‌తోనే పార్టీని న‌డిపించాల‌ని బాబు నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.