8 ఏళ్ళ తర్వాత బ్రహ్మి త్రివిక్రమ్

కొన్ని కాంబినేషన్లు చాలా క్రేజీగా ఉంటాయి. తెరమీద హిలేరియస్ గా పండుతాయి. బ్రహ్మానందం త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక ఈ క్యాటగిరీలోకే వస్తుంది. అతడు నుంచి ఈ కాంబో ఎంత అద్భుతంగా పేలిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో చీటికీ మాటికీ అత్తారింటికి వచ్చే అల్లుడిగా ఆయన టైమింగ్ ఇప్పటికీ సోషల్ మీడియా మీమ్స్ లో వాడుతూనే ఉంటారు. జల్సాలో కానిస్టేబుల్ ప్రణవ్ ని ఇంకో పాతిక సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేం. ఖలేజా, జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి ఇలా దేనికవే విభిన్నమైన కామెడీ క్యారెక్టర్లు పడ్డాయి.

తర్వాత ఎందుకనో ఇద్దరికీ గ్యాప్ వచ్చేసింది. అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవలో బ్రహ్మానందం కనిపించలేదు. ఏదో ఒక పాత్ర ఇచ్చే స్కోప్ ఉన్నా ఎందుకో మాటల మాంత్రికుడు పెద్దాయన్ని తీసుకోలేదు. అల వైకుంఠ పురములో రాములో రాములో పాటలో జస్ట్ ఒక ఫ్రేమ్ లో తళుక్కున మెరిసే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు గుంటూరు కారంలో ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి బ్రహ్మీ యాంగిల్ ని వాడుకునే పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ కి మార్పులు చేస్తున్న దశలో మహేష్ బాబు కోరిక మీదే ఇది సాధ్యమయ్యిందని యూనిట్ మాట.

మొత్తానికి ఫ్యాన్స్ కి ఇది శుభవార్తే. ఆ మధ్య నటించడం తగ్గించేసిన బ్రహ్మానందంకి జాతిరత్నాలు తర్వాత అవకాశాలు క్యూ కడుతున్నాయి. రంగమార్తాండలో కృష్ణవంశీ సీరియస్ గా చేయించిన వేషం చప్పట్లు కొట్టించుకుంది ఎక్కువ ఆడియన్స్ కి రీచ్ కాలేదు. కానీ తరుణ్ భాస్కర్ కీడా కోలా మరో పెద్ద బ్రేక్ అవుతుందని ఆల్రెడీ టాక్ ఉంది. ఇప్పుడు త్రివిక్రమ్ మూవీలో ఉంటే మరోసారి కామెడీ మేజిక్ జరిగే అవకాశం లేకపోలేదు. 2024 సంక్రాంతికి విడుదలవుతున్న గుంటూరు కారం షూట్ ఇకపై నాన్ స్టాప్ గా జరగనుంది. పండగ సీజన్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోరట