ఆ సినిమాపై క్లారిటీ ఇచ్చిన హీరో


సౌత్ ఇండియాలో తనకంటూ ఒక స్థాయి ఉన్న హీరోల్లో మాధవన్ ఒకడు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి తన పాపులారిటీ, మార్కెట్‌ను బాగానే పెంచుకున్నాడీ టాలెంటెడ్ యాక్టర్. అతను కొన్నేళ్ల కిందట ఒక బృహత్తర ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నాడు. అదే.. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్. మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేయడమే కాదు.. స్వీయ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీని తీర్చిదిద్దాడు మాధవన్. అతను ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి కూడా.

కొన్ని నెలల కిందట రిలీజైన ‘రాకెట్రీ’ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. సినిమా మీద అంచనాలు పెంచింది. మాధవన్ కెరీర్లో ఒక స్పెషల్ మూవీ అయ్యేలా కనిపించింది ‘రాకెట్రీ’. కానీ గత ఏడాదే పూర్తయి కొన్ని నెలల కిందటే ఫస్ట్ కాపీతో రెడీ అయిన ఈ చిత్రం ఎంతకీ విడుదల కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

మాధవన్ పూర్తిగా ఈ ప్రాజెక్టుకే అంకితం అయిపోయి.. వేరే సినిమాల వైపు చూడకపోవడం తన అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. నెమ్మదిగా జనాలు ‘రాకెట్రీ’ గురించి మరిచిపోతుండటంతో ఎట్టకేలకు మాధవన్ ఈ సినిమా గురించి స్పందించాడు. ‘రాకెట్రీ’ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైన సినిమా అని, ఎంతో కష్టపడి తీసిన ఈ చిత్రాన్ని పరిస్థితులు బాగా లేనపుడు రిలీజ్ చేయలేక ఆగామని చెప్పాడు. దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకునే వరకు సినిమాను రిలీజ్ చేయలేమని.. ఉత్తరాదిన కూడా ఈ సినిమా మంచి ప్రభావం చూపుతుందని.. మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకోనపుడు సినిమాను ఎలా విడుదల చేస్తామని మాధవన్ ప్రశ్నించాడు. సాధారణ పరిస్థితులు రాగానే ‘రాకెట్రీ’ రిలీజవుతుందని అతను వెల్లడించాడు.

రాకెట్ సైన్స్‌లో గొప్ప పరిజ్ఞానం సంపాదించి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలకు దీటుగా ఎదిగి.. ఎన్నో దేశాల నుంచి ఆహ్వానాలు అందుకున్న వ్యక్తి నంబి నారాయణన్. ఇస్రో చేపట్టిన అనేక గొప్ప ప్రాజెక్టుల్లో భాగస్వామి అయిన నంబి మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చి ఆయన అప్రతిష్ట పాలు కావడం.. ఎన్నో ఏళ్లు న్యాయస్థానాల్లో పోరాడి చివరికి కడిగిన ముత్యంలా బయటికి రావడం.. ఇలా నంబి జీవితంలో మలుపులెన్నో, ఆయన కథను ఎంతో సిన్సియర్‌గా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు మాధవన్.