వర్కు ఫ్రం హోం కాదంటే.. ఉద్యోగానికి చెల్లుచీటి?

కరోనాకు ముందు కొద్ది మంది ఐటీ ఉద్యోగులకు.. వారికున్న ఆరోగ్య సమస్యలు లేదంటే.. ఇంట్లోని పరిస్థితుల కారణంగా పరిమిత కాలానికి వర్కు ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించే వారన్నది తెలిసిందే. మాయదారి మహమ్మారి పుణ్యమా అని.. సీన్ మొత్తం మారిపోయింది. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఐటీ ఉద్యోగులు మాత్రమే కాదు.. ఐటీయేతర కంపెనీల్లోనూ వర్కు ఫ్రం హోంను షురూ చేశారు. చివరకు కాల్ సెంటర్లు సైతం ఇంటి నుంచే తమ ఉద్యోగుల్ని పని చేసే సదుపాయాన్నికల్పించారు.

మొదటి వేవ్ ను తలదన్నేలా సెకండ్ వేవ్ రావటం.. మూడో వేవ్ లో పిల్లలే టార్గెట్ అవుతారన్న ప్రచారం బాగా జరగటం తెలిసిందే. అదిగో థర్డ్ వేవ్.. ఇదిగో థర్డ్ వేవ్ అన్న మాటలకే కానీ.. అలాంటిదేమీ లేకపోవటం.. స్థిరంగా కేసుల నమోదు తగ్గిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో స్కూళ్లు.. కాలేజీలు ఓపెన్ కావటం మొదలు పెట్టారు. చాలా కంపెనీలు ఇప్పుడిప్పుడే ఆఫీసులకు తమ ఉద్యోగుల్ని రావాలని పిలుస్తున్నాయి. ఐటీలో అగ్రశ్రేణి కంపెనీలు కొన్ని మాత్రం వచ్చే ఏడాది వరకు ఇంటి నుంచే పని అని చెప్పగా.. మిగిలిన చాలా కంపెనీలు మాత్రం సెప్టెంబరు ఒకటి నుంచి ఆఫీసుకు రమ్మని చెబితే.. మరికొన్ని కంపెనీలు మాత్రం అక్టోబరు – నవంబరులో ఉద్యోగులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది.

అయితే.. చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయటానికే మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఈ తీరు ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉందని తాజా అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. లండన్ కు చెందిన ప్రైజ్ వాటర్ హైజ్ కూపర్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించింది. వర్కు ఫ్రం హోంలో ఉన్న 41 శాతం ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయటానికి ఇష్టపడటం లేదని నివేదిక స్పష్టం చేసింది.

జనవరిలో ఈ కంపెనీ నిర్వహించిన సర్వేలో 29 శాతం మంది మాత్రమే ఆఫీసుకు వచ్చి పని చేయటానికి ఇష్టపడకుంటే.. రెండో వేవ్ తర్వాత.. తాజాగా మాత్రం ఉద్యోగులుకు మరింత ఎక్కువ మంది ఆఫీసుకు రావటానికి ఆసక్తిని చూపించకపోవటం గమనార్హం. ఇదిలా ఉంటే భారత్ కు చెందిన ఒక ప్రముఖ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ ఆగస్టు రెండో వారంలో లక్షన్నర మంది ఉద్యోగుల అభిప్రాయాలతో ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో 48 శాతం ఉద్యోగులు శాశ్వతమైన వర్కు ఫ్రంహోంకు మొగ్గు చూపినట్లుగా తేల్చారు.

రిమోట్ వర్కుతో తాము ఒత్తిడిలో ఉన్నప్పటికి అన్ని విధాలుగా సౌకర్యంగా ఉన్నట్లుగా చెప్పటం గమనార్హం. ఇంటి నుంచి పని చేస్తున్న చాలామంది ఉద్యోగులు..కరోనా వేళలో ఇళ్లకు వెళ్లిపోవటం తెలిసిందే. హైదరాబాద్ వరకు చూస్తే.. తమ స్వగ్రామాలకు వెళ్లిపోయిన వారు.. అక్కడే ఉండిపోతున్నారు. సుమారు 40 శాతం మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ను వదిలి తమ ఊళ్లకు వెళ్లిపోయి ఉంటున్నారు. అలాంటి వారు తిరిగి వచ్చి మళ్లీ అద్దె ఇళ్లల్లోకి చేరటానికి.. హాస్టల్స్ లో చేరటానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు.. ఆ సమయానికి థర్డ్ వేవ్ వస్తే తమకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో.. ఇప్పటికైతే వర్కు ఫ్రం హోం ఇవ్వాల్సిందేనని కంపెనీల్ని అడుగుతున్నారు. అందుకు నో చెబుతున్న కంపెనీలను వదిలి పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదంటున్నారు.

కంపెనీకి వచ్చి పని చేయాలని అడిగిన ఉద్యోగుల్లో అనుభవం ఉన్న వారు జాబ్ వదిలేసి.. తాము కోరినట్లు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉన్న కంపెనీల్లో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో.. కొన్ని కంపెనీలు మానవవనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో.. అట్రిషన్ రేటు ఎక్కువ అవుతోంది. అమెరికా లాంటి దేశాల్లో డెల్టా వేరియంట్ గుబులుతో ఇంటి నుంచి పని చేయటానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తంగా ఉద్యోగుల్ని ఇంటి నుంచి ఆఫీసుకు తీసుకొచ్చి పని చేయించటం అన్నది ఇప్పుడో పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.