జ‌గ‌న్ స‌ర్కారుకు సుప్రీం రూ. లక్ష జరిమానా..

ఏపీ స‌ర్కారు కు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీం కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ స‌ర్కారుకు.. ఎదుర‌వుతున్న ప‌రాభ‌వాల్లో ఇది తార‌స్థాయికి చేరింది. వాస్త‌వానికి ఇటీవ‌ల తీసుకున్న నిర్ణ‌యాల‌పై కూడా హైకోర్టు 24 గంట‌ల కింద‌టే.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ముఖ్యంగా తిరుమ‌ల తిరుప‌తి బోర్డు నియామ‌కాల‌పై నిప్పులు చెరిగింది. ఇదేమ‌న్నా.. సొంత జాగీరా.. అంటూ.. ప్ర‌శ్నించింది. ప్ర‌త్యేక ఆహ్వానితుల‌ను నియ‌మిస్తూ.. ఇచ్చిన జీవోను హైకోర్టు స‌స్పెండ్ చేసింది. ఇక‌, ఈ రోజు(గురువారం) ఉద‌యం కూడా హైకోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురైంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ దాడి చేయ‌డం.. దీనిని టీడీపీ నాయ‌కులు నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌రిగిన ర‌గ‌డ‌తోపాటు.. డీజీపీ కార్యాల‌యం వ‌ద్ద కూడా టీడీపీ నేత‌ల‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. అయితే ఇంత జ‌రిగినా.. టీడీపీ నేత‌ల‌పై పోలీసులు ఎదురు కేసులు పెట్టారు. వారిపై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్ట‌డంతో త‌మ్ముళ్లు హైకోర్టును ఆశ్ర‌యించారు. తాజాగా ఆకేసులోనూ.. స‌ర్కారుకు షాక్ ఇస్తూ.. హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీడీపీ నేత‌ల‌పై పెట్టిన కేసుల‌పై విచార‌ణ నిలిపి వేసి.. సెక్ష‌న్ 41 ఏ కింద నోటీసులు ఇచ్చి వారి నుంచి వివ‌ర‌ణ తీసుకోవాల‌ని.. పోలీసుల‌కు సూచించింది.

అంటే.. హైకోర్టు స‌ర్కారు దూకుడుకు గ‌ట్టిగానే షాకిచ్చింద‌న్న‌మాట‌. ఇక‌, ఇప్పుడు ఇదే రోజు.. సుప్రీం కోర్టులో ఏపీ స‌ర్కారుకు మ‌రింత ప‌రాభ‌వం ఎదురైంది.. ఏకంగా.. ఇక్క‌డ జ‌రిమానా కొర‌డా ప‌డింది. ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగిన సుప్రీం కోర్టు.. జ‌రిమానా క‌ట్టాల్సిందేన‌ని ప‌ట్టుబ‌ట్టింది. విష‌యం ఏంటంటే.. దేవి సీఫుడ్స్‌ లిమిటెడ్‌ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.

హైకోర్టు ఆదేశాలు అమలు చేయకుండా దిక్కరణ మినహాయింపు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ప్రభుత్వం కోరింది. గురువారం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. దీంతో ఒకే రోజు రెండు కేసులు.. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మూడు కేసుల్లో కోర్టుల నుంచి ఏపీ ప్ర‌భుత్వం తీవ్ర‌స్థాయిలో ఎదురు ద‌బ్బ‌లు త‌గిలించుకుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.