ముందుస్తుకు రెడీ అయిపోతున్నారా ?

Jagan Mohan Reddy

తాజాగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వింటుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే డిసెంబర్ నుండి వార్డు, గ్రామ సచివాలయాలను తాను పర్సనల్ గా సందర్శించబోతున్నట్లు చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడిన జగన్ డిసెంబర్ నుండి రెగ్యులర్ గా తాను వ్యక్తిగతంగా సచివాలయాలను సందర్శించబోతున్నట్లు చెప్పారు. తాను సందర్శించటమే కాకుండా జిల్లా అధికారులను సందర్శించమన్నారు. అలాగే ఎంఎల్ఏలు వచ్చే నెలనుండి నెలకు నాలుగు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వార్డు, గ్రామ సచివాలయాలు బాగా పాపులరయ్యాయి. ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమపథకాలను జనాలకు అందించటం, పథకాల అమలు విషయంలో జనాభిప్రాయాన్ని ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ అందించటమే గ్రామ, వార్డు సచివాలయాలపని. అలాగే ఎంఆర్వో, మున్సిపల్, ఎలక్ట్రిసిటి ఆఫీసులతో జనాలకు పనులుంటే వాటి కోసం వచ్చే ప్రజలకు గైడ్ చేయటం, దగ్గరుండి సాయం అందించటం వాలంటీర్లు చేస్తున్నారు.

ఇలాంటి అనేక పనులతో సచివాలయాలంటే జనాల్లో మంచి సానుకూలత ఏర్పడింది. అన్నింటికీ మించి వాలంటీర్ల వ్యవస్ధ బాగా పాపులరైందంటే ప్రతినెల 1వ తేదీన పెన్షన్లు అందిస్తున్న కారణంగానే. జనాల్లో ఇంత పాపులరైన వ్యవస్ధను జగన్ వ్యక్తిగతంగా సందర్శించబోతున్నారు. సచివాలయం వ్యవస్ధ ఏర్పడిన దగ్గర నుండి ఇప్పటివరకు జగన్ వ్యక్తిగతంగా సందర్శించలేదు. మంత్రులు, ఎంఎల్ఏలు వీటిని సందర్శిస్తున్నది లేండి స్పష్టంగా తెలీదు. అందుకనే ఎంఎల్ఏలు ప్రతినెల నాలుగు సచివాలయాలను కచ్చితంగా సందర్శించాలని ఆదేశించింది.

తాను రెగ్యులర్ గా సందర్శించటమే కాకుండా ఎంఎల్ఏలను కూడా సందర్శించాలని చెప్పారంటే జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోవటమే అని అర్ధమైపోతోంది. ఎంఎల్ఏలు సందర్శిస్తారంటే ఎలాగూ అధికారులుంటారు. అయితే ప్రజాప్రతినిధులతో సంబంధంలేకుండా కలెక్టర్లు, ఎస్పీలు, జాయిట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లు, ఐటీడీఏ పీవో అందరినీ సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారంటేనే కారణం అర్ధమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో గెలవటానికి జగన్ దగ్గరున్న తురుపుముక్కల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న వాలంటీర్ల వ్యవస్ధ కూడా ఒకటి. జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్న నవరత్నాల పథకాల అమలు విషయంలో వాలంటీర్లదే కీలకమైన పాత్ర. వీళ్ళు సక్రమంగా పనిచేస్తే ప్రభుత్వంపై జనాల్లో సానుకూలత ఏర్పడుతుంది. ఈమధ్య జరిగిన క్యాబినెట్ సమావేశంలో జగన్ ముందస్తు ఎన్నికల ప్రస్తావన తెచ్చినట్లు ప్రచారం జరిగింది. అదే నిజమైతే డిసెంబర్ నుండి సచివాలయాలను వ్యక్తిగతంగా సందర్శించటం వ్యూహాత్మకమనే చెప్పాలి.