మాస్ట్రో.. మ‌ల‌యాళంలో ఎవ‌రంటే?

బాలీవుడ్లో మూడేళ్ల కింద‌ట రిలీజై సూప‌ర్ హిట్ట‌యిన థ్రిల్ల‌ర్ మూవీ అంధాదున్ తెలుగులో మాస్ట్రోగా రీమేక్ కావ‌డం తెలిసిందే. మాస్ట్రో మొద‌లైన కొన్ని రోజుల‌కే త‌మిళంలోనూ అంధాదున్ రీమేక్‌ను ప‌ట్టాలెక్కించారు. అక్క‌డ సీనియ‌ర్ హీరో ప్ర‌శాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆయ‌న తండ్రి త్యాగ‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా మొద‌లైంది. ఒరిజిన‌ల్లో ట‌బు చేసిన పాత్ర‌కు సిమ్రాన్‌ను తీసుకోగా.. రాధిక క్యారెక్ట‌ర్‌ను ప్రియా ఆనంద్ చేస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

కాగా అంధాదున్ మ‌ల‌యాళంలో కూడా రీమేక్ కావ‌డం విశేషం. అక్క‌డ భ్ర‌మం పేరుతో ఈ సినిమా తెర‌కెక్కింది. న‌టుడు, ద‌ర్శ‌కుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మ‌ల‌యాళంలో లీడ్ రోల్ చేశాడు.

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ రాశి ఖ‌న్నా ఈ చిత్రంతో మ‌ల‌యాళంలో అడుగు పెడుతుండ‌టం గ‌మ‌నార్హం. ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్న లెజెండ‌రీ సినిమాటోగ్రాఫ‌ర్ ర‌వి.కె.చంద్ర‌న్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తెలుగులో త‌మ‌న్నా చేసిన ట‌బు పాత్ర‌ను అక్క‌డ మ‌మ‌తా మోహ‌న్ దాస్ చేసింది. ఆమె ప్రియుడి పాత్ర‌లో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి ఫేమ్ ఉన్ని ముకుంద‌న్ న‌టిస్తున్నాడు. మాస్ట్రో త‌ర‌హాలోనే ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అక్టోబ‌రు 7న అమేజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుద‌ల‌వుతోంది. పృథ్వీరాజ్ చివ‌రి రెండు చిత్రాలు కురుతి, కోల్డ్ కేస్ కూడా నేరుగా అమేజాన్ ప్రైమ్‌లోనే రిలీజై మంచి స్పంద‌న తెచ్చుకున్నాయి. మ‌రి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో.. రాశి మాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.