కాంగ్రెస్ ఈ ముఖ్య‌మంత్రినీ మార్చేస్తుందా?

ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల్లో ముఖ్య‌మంత్రుల‌ను మార్చ‌డ‌మ‌నేది స‌రికొత్త ట్రెండుగా మారింద‌నే చెప్పాలి. ప్ర‌ధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడిదే బాట‌లో సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిని త‌గ్గించ‌డానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారం ద‌క్కించుకోవ‌డానికి.. ఇలా వివిధ కార‌ణాల‌తో సామాజిక స‌మీక‌ర‌ణ‌లను దృష్టిలో పెట్టుకుని ముఖ్య‌మంత్రుల‌ను మార్చేస్తున్నాయి. తాజాగా మ‌రో కాంగ్రెస్ ముఖ్య‌మంత్రిపై కూడా వేటు ప‌డే అవ‌కాశాలున్నాయ‌నే వార్త‌లొస్తున్నాయి.

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప‌ను తొల‌గించిన బీజేపీ అధిష్ఠానం.. ఆయ‌న స్థానంలో బ‌స‌వ‌రాజును ఎంపిక చేసింది. ఇక ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లోనూ సీఎం మార్పు త‌ప్ప‌లేదు. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో అక్క‌డి ప‌టేల్ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల‌కు ఆక‌ట్టుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన బీజేపీ.. విజ‌య్ రూపానీకి వీడ్కోలు ప‌లికి సీఎం కుర్చీపై భూపేంద్ర ప‌టేల్‌ను కూర్చోబెట్టింది. ఇక పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్ప‌డిన విభేధాలు తార‌స్థాయికి చేర‌డంతో కెప్టెన్ అమ‌రీంద‌ర్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేదు. ఆయ‌న స్థానంలో చ‌రణ్‌జిత్ సింగ్ చ‌న్నీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.

ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ ఒంట‌రిగా అధికారంలో ఉన్న‌ది మూడు రాష్ట్రాల్లోనే. పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో హ‌స్తం పార్టీ ప్ర‌భుత్వాలున్నాయి. ఇప్పుడు పంజాబ్‌లో ముఖ్య‌మంత్రిని మార్చిన ఆ పార్టీ.. తాజాగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 2018 శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్ర ఓట‌ర్లు కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్ట‌బెట్టారు. అప్పుడు భూపేష్ బ‌గేల్‌ను అధిష్థానం ముఖ్య‌మంత్రిగా ఖ‌రారు చేసింది. ఆ పార్టీ కీల‌క నేత రాహుల్ గాంధీ.. టీఎస్ సింగ్ వైపు మొగ్గు చూపినా సోనియా జోక్యంతో భూపేష్ సీఎం అయ్యారు. అయితే అప్పుడు సీఎం ప‌ద‌విని స‌గం స‌గం పంచుకోవాల‌ని రెండున్న‌రేళ్ల పాటు భూపేష్‌.. ఆ త‌ర్వాత రెండున్న‌రేళ్ల పాటు సింగ్‌ ముఖ్య‌మంత్రిగా ఉండాల‌నేలా అధిష్ఠానం నిర్ణ‌యించింద‌నే వార్త‌లొచ్చాయి.

ఇప్పుడు రెండున్న‌రేళ్ల ప‌ద‌వి కాలం పూర్తి చేసుకున్న భూపేష్‌ను సీఎం పీఠం నుంచి త‌ప్పించాల‌ని పార్టీ నేత‌ల నుంచి ఒత్తిడి వ‌స్తోంది. దీనిపై ఢిల్లీలో కూడా పంచాయ‌తీ జ‌రిగింది. అధిష్ఠానం ఇచ్చిన హామీ ప్ర‌కారం త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని సింగ్ దేవ్ కోరుతున్నారు. రాహుల్ గాంధీ ఆయ‌న‌తో మాట్లాడి స‌ర్దిచెప్పాల‌ని ప్ర‌య‌త్నించినా సింగ్ దేవ్ వ‌ర్గం మాత్రం అందుకు ఒప్పుకోలేద‌ని తెలిసింది. దీంతో భూపేష్‌ను త‌ప్పించి ఆ ప‌ద‌విని సింగ్ కు క‌ట్ట‌బెట్టే దిశ‌గా కాంగ్రెస్ సాగుతున్న‌ట్లు అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అసంతృప్తుల‌ను బుజ్జ‌గించాలంటే అదొక్క‌టే మార్గ‌మ‌ని కాంగ్రెస్ అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.