శ్రీవారి దర్శనానికి డేట్ ఫిక్సయింది

Tirumala

ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ప్రార్థనా మందిరాలన్నీ తెరుచుకోబోతున్నాయి. జూన్ 8 నుంచి దేవాలయాలు, మసీదులు, చర్చిలు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఐతే మిగతా వాటి కంటే దేశంలో అత్యధికంగా ఎదురు చూస్తున్నది తిరుమల శ్రీవారి దర్శనం కోసమే. రోజూ లక్ష మందికి పైనే దర్శించే శ్రీవారి ఆలయం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు పైగా మూత పడి ఉంది.

ఐతే ఎప్పుడు పున:ప్రారంభించినా భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని భక్తుల కోసం తెరుస్తారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఐతే టీటీడీ ఈ విషయంలో ముందడుగే వేయడానికి నిశ్చయించుకుంది. జూన్ 8నే శ్రీవారి ఆలయాన్ని తెరవబోతున్నారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

టీటీడీ అయితే 8నే దర్శనాల్ని మొదలుపెట్టాలనుకుంటోంది. దీనికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపాల్సి ఉంది. అది లాంఛనమే అని భావిస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఆన్ లైన్, కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లు కేటాయించనున్నారు. ప్రతి భక్తుడికీ అలిపిరి వద్ద తనిఖీ కేంద్రంలతో, మెట్ల మార్గంలో వైద్య పరీక్షలు చేస్తారు. రోజూ నిర్ణీత సంఖ్యలోనే భక్తుల్ని కొండ మీదికి, దర్శనానికి అనుమతించనున్నారు. కంపార్టుమెంట్లలో భక్తుల్ని పెట్టే పద్ధతి కొన్ని నెలల పాటు ఉండదు.

అవన్నీ మూసి వేస్తున్నారు. నేరుగా క్యూ లైన్లలో ప్రవేశం మొదలవుతుంది. మళ్లీ ఆలయం నుంచి బయటికి వచ్చే వరకు భక్తుడికి భక్తుడికి మధ్య దూరాన్ని నిర్దేశిస్తూ రెడ్ టేపుతో మార్కింగ్ చేశారు. ఆ దూరం పాటిస్తూనే దర్శనానికి వెళ్లాలి. వసతి గదుల్లో ఒక్కో దాంట్లో ఇద్దరికి మించి అనుమతించరు. తలనీలాల వద్ద కూడా షరతులుంటాయి. దీనిపై ముందే మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నారు.