కొండా.. అదును కోసం చూస్తున్నారా?

రాజ‌కీయాల్లో దూకుడుగా ఉండ‌డ‌మే కాదు.. స‌రైన స‌మ‌యంలో స‌రైన వ్యూహాలు అనుస‌రించాల్సి ఉంటుంది. తెలివిగా అడుగులు వేయాల్సి ఉంటుంది. అదును కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మాజీ మంత్రి కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి కూడా ఇదే బాట‌లో సాగుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌కీయ నాయ‌కులు పార్టీలు మార‌డం స‌హ‌జ‌మే. ఎక్కువ కాలం ఖాళీగా ఉండ‌కుండా ఏదో ఓ పార్టీలో కొన‌సాగుతారు. కానీ ఇప్పుడు కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మాత్రం ఏ పార్టీలో లేన‌ప్ప‌టికీ రెండు ప్ర‌ధాన పార్టీల‌తో స‌న్నిహితంగా ఉండ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్యమంలో పాల్గొన్న విశ్వేశ్వ‌ర్‌రెడ్డి రాష్ట్రం వ‌చ్చాక 2014 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసి చేవెళ్ల నుంచి ఎంపీగా విజ‌యం సాధించారు. కానీ ఆ త‌ర్వాత టీఆర్ఎస్ కార్య నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌తో పొస‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న కారు దిగిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయ‌న 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అప్ప‌టి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో అంత ఆక్టివ్‌గా క‌నిపించ‌లేదు. కానీ ఆ త‌ర్వాత బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌యార‌నే ఊహాగానాలు వినిపించాయి. ఆయ‌న అడుగులు కూడా ఆ దిశ‌గా సాగిన‌ట్లు క‌నిపించాయి.

కానీ తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన త‌ర్వాత విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మ‌న‌సు మార్చుకున్న‌ట్లు క‌నిపించారు. తిరిగి కాంగ్రెస్‌లోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా ఆ విష‌యంలో విశ్వేశ్వ‌ర్ రెడ్డిని క‌ల‌వ‌డంతో ఆయ‌న కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతార‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. కానీ తిరిగి అధికారికంగా కాంగ్రెస్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ చేర‌లేదు. ఇదిలా ఉండ‌గా.. మ‌రోవైపు బీజేపీ ముఖ్య‌నేత జితేంద‌ర్ రెడ్డితో క‌లిసి విశ్వేశ్వ‌ర్‌రెడ్డి హుజూరాబాద్‌కు వెళ్లి మ‌రీ ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌ల‌వ‌డం రాజ‌కీయం వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఈట‌ల‌తో విశ్వేశ్వ‌ర్‌రెడ్డి చాలా సేపు మంత‌నాలు సాగించారు.

తాజాగా కేటీఆర్‌తో పాటు విశ్వేశ్వ‌ర్‌రెడ్డికి రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విశ్వేశ్వ‌ర్‌రెడ్డి.. రేవంత్‌కు మ‌ద్ద‌తుగా గ‌న్‌పార్క్‌కు వ‌చ్చారు. దీంతో అస‌లు ఆయ‌న ఏ పార్టీకి చెందిన నేత.. ఏ పార్టీలో చేర‌బోతున్నార‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేకుండా పోయింది. అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు అస‌లైన ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే పార్టీ వైపు విశ్వేశ్వ‌ర్‌రెడ్డి మొగ్గు చూపే అవ‌కాశాలున్నాయ‌ని రాజ‌కీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. కాంగ్రెల్ లేదా బీజేపీ.. అందులో ఏ పార్టీ అయితే టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయంగా మారుతుందో ఆ పార్టీలో ఆయ‌న చేరే ఆస్కార‌ముంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే ఆయ‌న స‌మయం కోసం ఎదురు చూస్తున్నార‌ని తెలుస్తోంది. టీఆర్ఎస్‌కు స‌రైన పోటీనిచ్చే పార్టీపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చిన త‌ర్వాత‌నే ఆయ‌న ఆ పార్టీ కండువా కప్పుకునే అవ‌కాశం ఉంది.