వక్కంతం వంశీ కథతో శర్వానంద్


యువ కథానాయకుల్లో ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేని విధంగా విభిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకునే నటుడు శర్వానంద్. అతను ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయడు. చివరగా ‘శ్రీకారం’ లాంటి సందేశం ముడిపడ్డ చిత్రంతో పలకరించిన శర్వా.. దానికి ముందు ‘జాను’ లాంటి ప్రేమకథా చిత్రం చేశాడు. ఇప్పుడేమో ‘మహా సముద్రం’ లాంటి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని తర్వాత పూర్తి భిన్నంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే ఫక్తు ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు.

ఆపై ‘గమ్యం’, ‘అందరి బంధువయా’ తరహాలో ‘ఒకే ఒక జీవితం’ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీతో రానున్నాడు శర్వా. ఆపై శర్వా చేయబోయే సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్లో తెరకెక్కబోతుండటం విశేషం.

తమిళంలో రెండు సినిమాలు తీసి.. తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో చూస్తున్న కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం.. శర్వా కొత్త చిత్రాన్ని రూపొందించనున్నాడట. అతను ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ‘కిరాక్ పార్టీ’కి దర్శకత్వం వహించాల్సింది. ముందు ఈ చిత్రానికి అతణ్నే దర్శకుడిగా ప్రకటించారు. కానీ తర్వాత ఏమైందో ఏమో అతనీ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చేశాడు. ఐతే ఇప్పుడు శర్వా కొత్త చిత్రంతో రాజు డైరెక్టర్‌గా తెలుగులోకి అడుగు పెట్టనున్నాడట. వీరి కలయికలో రాబోయే చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నది స్టార్ రైటర్ వక్కంతం వంశీనట.

‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా మారిన వంశీ.. కొన్నేళ్లు రచనకు దూరంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య మళ్లీ కలం ఝులిపిస్తున్నాడు. ‘ఏజెంట్’ మూవీకి కథ అందించాడు. దీంతో పాటు శర్వా-రాజు సినిమాకు కూడా అతను స్క్రిప్టు అందించాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో తెరకెక్కే ఈ చిత్రం గురించి త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.