ష‌ర్మిల పెయిడ్ దీక్షా.. గుట్టు బ‌య‌ట‌ప‌డిపోయిందా?!

తెలంగాణ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. పార్టీ పెట్టిన వైఎస్‌ ష‌ర్మిల‌కు తాజాగా భారీ షాక్ త‌గిలింది. ఆమె చేస్తున్న దీక్ష‌ల‌కు వ‌స్తున్న‌వారిని సాధార‌ణ ప్ర‌జ‌ల‌ని.. వారంతా సీఎం కేసీఆర్‌పై ఆగ్ర‌హంతో ఉన్నార‌ని కొన్నాళ్లుగా ఆమె చెబుతున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యాఖ్య‌ల వెనుక నిజాలు.. ఆ దీక్ష‌ల్లో కూర్చుంటున్న వారి అస‌లు విష‌యాలు వెలుగు చూశాయి. దీంతో ఈ ప‌రిణామం.. ష‌ర్మిల‌కు ఆమె పార్టీకి తీవ్ర ఇబ్బందిగా ప‌రిణ‌మించ‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలో ప్రతి వారం వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా… నిరుద్యోగ దీక్ష చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రాంతాల‌ను ఎంచుకుని మ‌రీ ఆమె ఈ దీక్ష‌లు చేప‌డుతున్నారు. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌రకు దీక్ష‌లో కూర్చుని.. సాయంత్రం మీడియాతో మాట్లాడి.. కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఈసారి ఆమె దీక్షలో రెండు ఆసక్తికర విషయాలు వెలుగు చూసి.. ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఒకటైతే… ఆమె దీక్షలో కుర్చొనేందుకు వచ్చామని.. ఇప్పుడు పైసలు ఇవ్వమంటున్నారని అడ్డకూలీలు ఆందోళనకు దిగారు.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో షర్మిల చేపట్టే నిరుద్యోగ దీక్ష వద్ద అడ్డా కూలీలు ఆందోళనకు దిగారు. మేడిపల్లి కెనరా నగర్ బస్స్టాపు వద్ద ఉన్న కూలీల వద్దకు… ఆ పార్టీకి చెందిన రాఘవ రెడ్డి వెళ్లి సాయంత్రం 6 గంటల వరకు దీక్షలో ఉండాలని వెల్లడించారు. అలా వచ్చిన ప్రతి ఒక్కరికి రూ.400 ఇస్తామని 50 మంది కూలీలను ఆర్టీసీ బస్సులో దీక్ష స్థలికి తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని చూసిన వారికి నిరాశే ఎదురైంది. డబ్బులు అడిగినా ఇవ్వకపో వడంతో కూలీలు ఆందోళనకు దిగారు. మీడియాతో మాట్లాడుతున్న కూలీలను.. నాయకులు నచ్చచెప్పి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లారు.

“ఏమి లేదు సార్.. ఒకసారు వంద మంది ఆడోళ్లను తీసుకుని రమ్మన్నాడు. అయితే నేను 55 మందిని దీక్ష కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్లను వద్దని అన్నారు. వీళ్లంతా డబ్బులు కోసం వచ్చారు. డబ్బులి స్తామంటేనే కూలీ మానుకుని వచ్చాము సార్.. ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటున్నారు. మేమేం చేయాలి. మా డబ్బులు మాకిప్పిస్తే మేము పోతాం సార్.. అటూ కూలీ పని పోయింది.. ఇటు డబ్బులు ఇవ్వట్లేదు.” అని కూలీలు మొర‌పెట్టుకున్నారు. ఇంత‌కీ పోలీసులు దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో ష‌ర్మిల దీక్ష విర‌మించుకున్నారు. దీంతో ఈ దీక్ష‌లో కూర్చోబెట్టేందుకు తీసుకువ‌చ్చిన పెయిడ్ దీక్షాప‌రులు ఇలా ప‌రువు తీసేశార‌న్న మాట‌!!