రాజు సుందరంతో శర్వానంద్!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. శర్వా నటించిన ‘పడి పడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’ లాంటి సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘శ్రీకారం’ సినిమా పర్వాలేదనిపించినా.. శర్వానంద్ రేంజ్ లో లేదనే మాటలు వినిపించాయి. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ కూడా ‘మహాసముద్రం’ సినిమాపైనే ఉన్నాయి. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో పాటు దర్శకుడు కిషోర్ తిరుమల రూపొందిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు శర్వానంద్. ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. దీని తరువాత శర్వానంద్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం చాలా రోజులుగా దర్శకుడిగా ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అప్పుడెప్పుడో ఆయన దర్శకత్వంలో ‘ఏగన్’ అనే సినిమా వచ్చింది.

ఆ తరువాత మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టుకోలేదు. ఇంతకాలానికి శర్వానంద్ హీరోగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి వక్కంతం వంశీ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. చాలా కాలంగా రాజు సుందరం-శర్వానంద్ ల మధ్య ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఫైనల్ గా శర్వా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.