కేసీఆర్‌పై పోరు బాట‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్రంలో తొలిసారి ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి దీటైన స‌వాళ్లు ఎదురవుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపించి సీఎం పీఠంపై కూర్చున్న ఆయ‌న‌కు.. ఇన్నాళ్ల‌కూ స‌రైన సెగ త‌గులుతోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌.. ఇటు తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఆయ‌న‌కు పోటీగా నిల‌బ‌డ్డారు. ఇప్పుడేమో తాజాగా రాష్ట్రంలోని బీజేపీ కాకుండా మిగ‌తా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి కేసీఆర్‌పై పోరాటానికి సిద్ధ‌మ‌య్యాయి.

2014 ఎన్నిక‌ల్లో తిరుగులేని విజ‌యం సాధించిన కేసీఆర్‌.. ఆ త‌ర్వాత ప్ర‌తిప‌క్ష పార్టీల్లో త‌న‌ను ప్ర‌శ్నించే నాయ‌కులు ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో కీల‌క నేత‌లంద‌రినీ టీఆర్ఎస్‌లో చేర్చుకున్నాడ‌నే అభిప్రాయాలున్నాయి. ఇక 2018లో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌రోసారి జ‌య‌భేరి మోగించిన టీఆర్ఎస్‌కు ఇక రాష్ట్రంలో తిరుగులేద‌ని అంతా అనుకున్నారు. కానీ గ‌తేడాది రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడిగా బండి సంజ‌య్ ఎన్నికైన త‌ర్వాత తెలంగాణ రాజ‌కీయాల్లో మార్పులు మొద‌ల‌య్యాయి. కేసీఆర్‌కు అడ్డంకులు అప్ప‌టి నుంచే ఆరంభ‌మ‌య్యాయి. దుబ్బాక ఉప ఎన్నిక‌తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లోనూ బండి సంజ‌య్ దూకుడుతో కేసీఆర్‌కు షాక్‌లు త‌గిలాయి. ఇక ఇటీవ‌ల టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక‌వ‌డం కేసీఆర్‌పై మ‌రింత ఒత్తిడి పెంచేదే. రేవంత్ య‌మ జోరుతో దూసుకెళ్తున్నారు. స‌భ‌లు ర్యాలీలు నిర‌స‌న‌లు ఫిర్యాదులు అంటూ కేసీఆర్‌పై దాడి చేస్తున్నారు. సీఎం సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే భారీ స‌భ నిర్వ‌హించి రేవంత్ స‌వాల్ విసిరారు.

ఇక ఇప్పుడికి రాష్ట్రంలో బీజేపీ కాకుండా ఇత‌ర ప్ర‌తిప‌క్షపార్టీల‌ను క‌లుపుకుని కేసీఆర్‌పై పోరాటం చేసేందుకు రేవంత్ సిద్ధ‌మ‌యారు. ఈ నేప‌థ్యంలో గాంధీభవ‌న్‌లో జ‌రిగిన ప్ర‌తిప‌క్షాల స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా అనుస‌రిస్తున్న ప్రజా వ్య‌తిరేక విధానాల‌పై పోరాడాల‌ని ఈ నేత‌లు నిర్ణ‌యించారు. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తెలంగాణ జ‌న స‌మితి, తెలంగాణ ఇంటి పార్టీ, న్యూడెమోక్ర‌సీ త‌దిత‌ర పార్టీలు ఈ స‌మావేశంలో పాల్గొని ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నాయి. భూ స‌మ‌స్య‌లు, భూ సేక‌ర‌ణ‌, ధ‌ర‌ణిలో లోపాలు, పోడు భూములు స‌మ‌స్య‌ల‌పై క‌లిసి పోరాడేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

ఈ నెల 22న మ‌హా ధ‌ర్నా నిర్వ‌హించాల‌ని ఈ పార్టీలు నిర్ణ‌యించాయి. అంతే కాకుండా ఈ నెల 27న రైతు సంఘాలు త‌ల‌పెట్టిన భార‌త బంద్‌లో భాగంగా రాష్ట్రంలోని ర‌హ‌దారుల‌ను దిగ్భంధ‌నం చేయ‌నున్న‌ట్లు తెలిపాయి. పోడు భూములు స‌మ‌స్య‌పై 400 కిలోమీట‌ర్ల మేర రాస్తారోకో నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నాయి. ఇలా రాష్ట్రంలోని బీజేపీ మిన‌హా ప్రతిప‌క్ష పార్టీలు కేసీఆర్‌పై పోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చేమోన‌ని రాజకీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి కేసీఆర్ ల‌క్ష్యంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌మ శైలిలో దూసుకెళ్తున్నాయి. మ‌రి వీటిని కేసీఆర్ ఎలా ఎదుర్కుంటారోన‌నే ఆస‌క్తి క‌లుగుతోంది.