రాజమౌళి సినిమా సంపత్ నందికి ఇస్తున్నారా..?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాల్లో ‘విక్రమార్కుడు’ సినిమా ఒకటి. రవితేజ డ్యూయల్ రోల్ పోషించిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాకి సీక్వెల్ తీయాలని అప్పట్లోనే అనుకున్నారు. కానీ రాజమౌళి ఎందుకో తన సినిమాల సీక్వెల్స్ అంటే దూరంగా ఉంటారు. కానీ రచయిత విజయేంద్రప్రసాద్ మాత్రం ‘విక్రమార్కుడు 2’ కథను సిద్ధం చేసేశారు. అయితే ఈ సినిమాను రాజమౌళి మాత్రం డైరెక్ట్ చేయరనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఈ కథను హ్యాండిల్ చేయగలిగే దర్శకుడి కోసం చూస్తున్నారు విజయేంద్రప్రసాద్.

ఇప్పటికే టాలీవుడ్ కి చెందిన కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఈ ప్రాజెక్ట్ కోసం విజయేంద్రప్రసాద్ ను సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ‘విక్రమార్కుడు2’ ప్రాజెక్ట్ దర్శకుడు సంపత్ నంది చేతికి వెళ్లినట్లు టాలీవుడ్ టాక్. మాస్ సినిమాలను తెరకెక్కించడంలో సంపత్ నందికి మంచి టాలెంట్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కమర్షియల్ గా బాగానే వర్కవుట్ అయ్యాయి. రీసెంట్ గా సంపత్ నంది రూపొందించిన ‘సీటీమార్’ సినిమాకి ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి.

ఈ సినిమాతో మరోసారి మాస్ కథలను బాగా హ్యాండిల్ చేయగలడని నిరూపించుకున్నారు. అందుకే ‘విక్రమార్కుడు 2’ ప్రాజెక్ట్ ఆయనకు అప్పగించాలని అనుకుంటున్నారట. పైగా గతంలో రవితేజ హీరోగా ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా తీశారు సంపత్ నంది. ఆ సినిమా బాగానే ఆడింది. కాబట్టి ‘విక్రమార్కుడు2’ విషయంలో రవితేజకి కూడా అభ్యంతరం లేకపోవచ్చు. అయితే సంపత్ నంది మాత్రం మెగా కాంపౌండ్ లో సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. మరేం జరుగుతుందో చూడాలి!