చిరంజీవి, రామ్ చరణ్ లపై తేనెటీగల దాడి !

కంగారు పడకండి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లపై తేనెటీగల దాడి జరిగింది నిజమే. కానీ ఈ దాడిలో వారికి ఏమీ కాలేదు. కామారెడ్డి లో ఒక కార్యక్రమానికి వెళ్లిన వీరిపై తేనెటీగలు దాడి చేశాయి. హైదరాబాదులో ఉన్న వీరు అంత సడెన్ గా అక్కడికి ఎపుడు వెళ్లారు? ఎందుకు వెళ్లారు?

కామారెడ్డి పరిధిలోని దోమకొండలో రామ్ చరణ్ భార్య ఉపాసన స్వగ్రామం ఉంటుంది. ఇటీవలే స్వర్గస్తులైన ఉపాసన తాత కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలు ఈరోజు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్లిన చిరంజీవి, రాంచరణ్, ఉపాసనలతో పాటు పలువురు ఇతర కుటుంబ సభ్యులపై తేనెటీగలు దాడిచేశాయి.

అయితే వారి భద్రతా సిబ్బంది వెంటనే గమనించి వారిని తేనెతీగల దాడి నుంచి తప్పించారు. అంత్యక్రియలు జరుగుతున్నది కోటలోనే కావడంతో వాటి దాడి నుంచి రక్షించుకోవడం సులువైంది.

దాడిలో చిరంజీవి, రాంచరణ్, కామినేని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా బయటపడ్డారు కానీ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో కొందరు తేనెటీగల బారిన పడ్డారు. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి జరిగిన సమయంలో కాామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చారు. ఆయన కూడా క్షేమంగా ఉన్నారు.