చై-సామ్ మాట్లాడరు.. అర్థం చేసుకోవాలంతే

దాదాపు నెల రోజుల నుంచి టాలీవుడ్లో అక్కినేని నాగచైతన్య-సమంతల బంధం గురించే చర్చ. ప్రేమించి పెళ్లి చేసుకుని మూడేళ్లకు పైగా వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయని.. ఇద్దరూ విడిపోతున్నారని.. విడాకులకు సిద్ధమయ్యారని.. ఇద్దరినీ కలపడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. నమ్మనూ లేదు. కానీ తర్వాతి పరిణామాలు చూశాక నెమ్మదిగా విషయం స్పష్టమవుతూ వచ్చింది.

సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరులోంచి ‘అక్కినేని’ అని తీసేసి ‘ప్రభు’ అని తండ్రి పేరు పెట్టుకోవడంతోనే సమంత అసలేం జరుగుతోందన్నది స్పష్టం చేసేసిందని చెప్పొచ్చు. చైతూకు ఆమె దూరం అవుతోందనడానికి మరిన్ని రుజువులు కనిపించాయి.

ఐతే చైతూ, సమంత మీడియా ముందుకు రాకపోరు. తమ బంధం విషయంలో ఏం జరుగుతోందో క్లారిటీ ఇవ్వకుండా పోరు అని అందరూ ఎదురు చూస్తూ వచ్చారు. కానీ ఆ సందర్భాలు వచ్చినా కూడా స్పష్టత రాలేదు. ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియా ముందుకు రాబోతూ.. చైతూ చాలా క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు. వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నలు వేయకూడదని పీఆర్వోల ద్వారా మీడియాకు సమాచారం ఇచ్చాడు. ఆల్రెడీ ప్రమోషన్లలో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో మాట్లాడిన చైతూ.. సమంత గురించి ప్రశ్నలు రాకుండా చూసుకున్నాడు. రేప్పొద్దున ప్రెస్ మీట్ పెట్టినా చైతూ నుంచి ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశమే లేదు.

మరోవైపు సమంత సైతం తిరుమలలో మీడియా వాళ్లు ఈ విషయం అడిగితే సీరియస్ అయింది. ఆమెకు కూడా ఈ విషయంపై స్పందించే ఉద్దేశం లేదని అర్థమవుతోంది. బహుశా ఇద్దరూ పూర్తిగా విడిపోయే వరకు ఈ విషయంపై మాట్లాడొద్దని అనుకుంటున్నారా.. లేక మధ్యలో వీరిని కలపడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతుండటం వల్ల సైలెంటుగా ఉంటుున్నారా అన్నది తెలియడం లేదు. కాబట్టి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందని మాత్రం జనాలు అర్థం చేసుకోవాలి. అక్టోబరు 7న వీరి పెళ్లి రోజు రానుంది కాబట్టి ఆ రోజు వీరెలా వ్యవహరిస్తారన్న దాన్ని బట్టి ఒక అంచనాకు రావచ్చేమో.