క‌ర‌ణంను వ‌ణికిస్తున్న ప‌రుచూరు.. రీజ‌నేంటి..?

గ‌త 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌కాశం జిల్లా చీరాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం త‌ర్వాత కాలంలో రాజ‌కీయ మార్పుల నేప‌థ్యంలో వైసీపీలోకి వ‌చ్చారు. ఇక్క‌డ త‌న‌హవా చ‌లాయిస్తున్నారు. అయితే.. చీరాల విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ఆల్రెడీ.. వైసీపీకి ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు. ఆమంచి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ కోసం ఆయ‌న ఎంతో ప‌నిచేస్తున్నారు. స్థానికంగా కూడా మాస్ లీడ‌ర్‌గా ఆయ‌న‌కు పేరుంది.

ప్ర‌స్తుతం ఆయ‌న ఎమ్మెల్యే కాక‌పోయినా..కూడా ప్ర‌జ‌లు ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఆయ‌న ఇంటి గ‌డ‌పే తొక్కుతున్నారు. గ‌తంలో చీరాల నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు విజ‌యం సాధించ‌డంతో పాటు ఓ సారి ఇండిపెండెంట్‌గా కూడా గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే క‌ర‌ణం.. వైసీపీలో ఉండ‌డం.. ఆమంచి కూడా వైసీపీ నాయ‌కుడే కావ‌డంతో.. చీరాల టికెట్‌ను ఎవ‌రికి కేటాయించాల‌నేది పార్టీకి ఒకింత ఇబ్బందిక‌ర‌మే! ఈ క్ర‌మంలోనే పొరుగునే ఉన్న ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం కేటాయించేందుకు రెడీ అయింది. దీనిని క‌ర‌ణంకు కేటాయిస్తే.. మంచిద‌ని.. పార్టీలో సీనియ‌ర్లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత కావ‌డం.. ప‌రుచూరులో క‌మ్మ వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌డం వంటివి క‌ర‌ణంకు క‌ల‌సి వ‌స్తాయ‌నేది పార్టీ అంచ‌నా.. అయితే.. అక్క‌డ‌కు వెళ్లేందుకు క‌ర‌ణం హ‌డ‌లి పోతున్నారు. “ఏం జ‌రిగినా.. అక్క‌డ‌కు మాత్రం వెళ్ల‌ను” అని ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో చెబుతున్నార‌ట‌. కానీ, పార్టీ అధిష్టానం మాత్రం “మీరు అవ‌కాశం ఉంటే.. ప‌రుచూరుకు వెళ్లండి” అని స్వ‌యంగా జ‌గ‌న్ నుంచే ఆయ‌న‌కు వ‌ర్త‌మానం అందింది. నిజానికి ఇది వైసీపీలో ఉన్న నేత‌గా, మ‌రీ ముఖ్యంగా క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌గా క‌ర‌ణంకు అందివ‌చ్చిన అవ‌కాశం.

ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న రాజ‌కీయాలు అద్దంకి, చీరాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఇక‌, ఇప్పుడు ఆయ‌న స‌త్తా నిరూపించుకునేందుకు ప‌రుచూరును వైసీపీ చేతిలో పెడ‌తాన‌ని చెబుతోంది. పైగా చీరాల అయితే.. వివాదం ఉంది. కానీ, ప‌రుచూరులో క‌ర‌ణంకు తిరుగులేదు. ఆయ‌న‌కు పోటీగా వ‌చ్చే నాయ‌కుడు కూడా లేరు. అంతేకాదు.. క‌మ్మ సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న వ్యూహాన్ని బ‌ట్టి ఆయ‌న‌కు అండ‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. అయినా క‌ర‌ణం మాత్రం.. ప‌రుచూరు వైపు త‌లెత్తి చూడ‌డం లేదు. దీనికి రెండు కార‌ణాలు ఉన్నాయ‌ని.. ఆయ‌న వ‌ర్గం తెర‌చాటుగా చెబుతోంది.

ఒక‌టి.. ప‌రుచూరులో క‌ర‌ణం దూకుడు ప‌నికిరాద‌ని.. ఆయ‌న అక్క‌డ త‌న ఇష్టాను సారం వ్య‌వ‌హ‌రిస్తే.. కుద‌ర‌ద‌ని.. అందుకే జంకుతున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు.. ప‌రుచూరులో బ‌లంగా ఉండ‌డం.. ఆయ‌న‌ను ఢీకొట్టి నిలిచే స‌త్తా.. క‌ర‌ణం లేక‌పోవ‌డం వంటివి కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీలోనే కొన్ని వ‌ర్గాలు అనుకూలంగా ఉన్న చోట ఎవ‌రైనా గెలుస్తార‌ని. కానీ, ప‌రుచూరు వంటి నియోజ‌క‌వ‌ర్గంలో గెలిస్తేనే క‌ర‌ణం స‌త్తా తెలుస్తుంద‌ని.. ఆయ‌న అక్క‌డకు వెళ్ల‌డ‌మే మంచిద‌ని అంటున్నారు.

ప‌రుచూరులో క‌నుక విజ‌యం ద‌క్కించుకుంటే.. ఇక‌, క‌ర‌ణంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న వ్యాఖ్య‌లు.. ఇత‌ర‌త్రా విమ‌ర్శ‌లు కూడా తొలిగిపోయే అవ‌కాశం ఉంద‌ని.. చీరాల‌ను ప‌ట్టుకుని వేలాడ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ.. క‌ర‌ణం మాత్రం ఈ విష‌యంలో మొగ్గు చూప‌డం లేదు. తాను చీరాల‌లోనే ఉంటాన‌ని చెబుతున్నార‌ట‌. ఏదేమైనా.. సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌ను అని చెప్పుకొనే క‌ర‌ణం ప‌రుచూరు అంటేనే ఆమ‌డ దూరంలో ఉంటున్నార‌ట‌.