ఏపీలో టెన్ష‌న్‌: ప‌రిష‌త్ ఫైట్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రోసారి రాజుకుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే అధికార పార్టీ వైసీపీ వ‌ర్సెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య భారీ ఎత్తున ఫైట్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి మ‌రింత కొన‌సాగింపుగా.. ఇప్పుడు ప‌రిష‌త్ వేడి రాజుకుంది. మ‌రో 24 గంట‌ల్లో రాష్ట్రంలో జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ప‌లితంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న ద‌రిమిలా.. గెలుపు మీదా.. మాదా.. అనే రేంజ్‌లో అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు అప్పుడే క‌త్తులు నూరుతున్నాయి. నిజానికి చంద్ర‌బాబు ఇంటిపై దాడి ఘ‌ట‌న త‌ర్వాత‌.. రెండు రోజుల్లోనే ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితం రావ‌డం.. మ‌రింత ఉద్రిక్త‌త‌కు.. ఉత్కంఠ‌కు దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టికే రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌.. ఫ‌లితాల వెల్ల‌డికి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ‌పై యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. దీంతో ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కే ప‌రిష‌త్ ఫ‌లితం మొద‌లు కానుంది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఏంటి? పుంజుకుంటుందా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన అంటే.. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ప‌రిస్థితి చూసుకుంటే.. టీడీపీ స్థానిక ఎన్నిక‌ల్లో తీవ్రంగా దెబ్బ‌తింది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ ప‌ట్టు సాధించ‌లేక పోయింది. ఇక‌, తిరుప‌తి ఉప ఎన్నిక‌లోనూ.. భారీ ఎత్తున ప్ర‌చారం చేసినా.. గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. ప‌రిష‌త్ ఎన్నిక‌ల ఫ‌లితం.. టీడీపీని ఊరిస్తోంది.

అదేస‌మ‌యంలో వైసీపీ ప‌రిస్థితి మ‌రింత ఆస‌క్తిగా మారింది. స్థానిక స‌మ‌రంలో దూసుకుపోయిన ఫ్యాన్ గాలి.. ఇప్పుడు కూడా అదే రేంజ్‌లో ఉంటుంద‌ని.. నాయ‌కులు అంచ‌నా వేసుకున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నేత‌లు.. మాత్రం కొన్ని అంచ‌నాలు వేస్తున్నారు. స్థానికం వేరు ప‌రిష‌త్ వేరు అని వారు లెక్క‌లు చెబుతున్నారు. మాకు విజ‌యం త‌ధ్యం అంటున్నారు. జిల్లా ప‌రిష‌త్‌లు 700 పైచిలుకు ఉంటే.. దీనిలో స‌గ‌మైనా.. మాకు ద‌క్కుతాయ‌ని .. ఒక‌రిద్ద‌రు అంటుంటే.. ఎమ్మెల్యే బుచ్చ‌య్య వంటివారు.. క‌నీసం 3-4 వంద‌ల స్థానాలు ద‌క్కించుకుంటామ‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌, ఏడు వేల పైచిలుకు మండ‌ల ప‌రిష‌త్‌లుఉంటే.. వీటిలోనూ.. వైసీపీ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని అంటున్నారు అధికార పార్టీ నేత‌లు.

కాగా, ఇప్ప‌టికే చాలా చోట్ల‌.. ఏక‌గ్రీవం అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, క‌డ‌ప‌, ప్ర‌కాశం జిల్లాల్లో.. చాలా ప‌రిష‌త్‌లు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన చోట్ల జ‌రిగిన ఎన్నిక‌ల‌కు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభ‌మైంది. అయితే.. ఫ‌లితం ఎవ‌రికి అనుకూలంగా వ‌చ్చినా.. వివాదాలు.. ఘ‌ర్ష‌ణ‌లు మాత్రం కామ‌న్ అనేమాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఆగ్రహావేశాల‌తో ర‌గిలిపోతున్న ఇరు పార్టీలు ఈ ఎన్నిక‌ల ఫ‌లితం త‌ర్వాత‌.. రెచ్చిపోయినా.. ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీ ల దూకుడుపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఎవ‌రికి ఏం ద‌క్కుతుంద‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. మ‌రి ఏం తేలుతుందో చూడాలి. ఏదేమైనా.. వైసీపీ, టీడీపీలు సంయ‌మ‌నం పాటించాల్సిన అవ‌స‌రం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.