పాకిస్థాన్‌కు ఇది మామూలు షాక్ కాదు


2009లో శ్రీలంక క్రికెట్ జ‌ట్టు మీద ఉగ్ర‌వాదుల దాడి జ‌రిగాక ఏడెనిమిదేళ్ల పాటు పాకిస్థాన్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ అన్న‌దే జ‌ర‌గ‌లేదు.ర‌క్ష‌ణ విష‌యంలో గ్యారెంటీ లేక‌ శ్రీలంక మాత్ర‌మే కాదు.. ఏ జ‌ట్టూ ఆ దేశంలో ప‌ర్య‌టించే సాహ‌సం చేయ‌లేదు. దీంతో తాము ఆతిథ్యం ఇవ్వాల్సిన సిరీస్‌ల‌ను యూఏఈ వేదిక‌గా నిర్వ‌హిస్తూ వ‌చ్చింది. చివ‌రికి పాకిస్థాన్ దేశ వాళీ క్రికెట్ లీగ్ పీఎస్ఎల్‌ను సైతం యూఏఈలోనే జ‌రుపుకోవాల్సి వ‌చ్చింది.

ఐతే స్వ‌దేశంలో మ‌ళ్లీ సిరీస్‌లు, లీగ్‌లు జ‌రిపించేందుకు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్ర‌య‌త్నం ఫ‌లించి గ‌త రెండేళ్ల నుంచే కొన్ని చిన్న జ‌ట్లు ఆ దేశంలో ప‌ర్య‌టించాయి. ఇప్పుడు న్యూజిలాండ్ లాంటి పెద్ద జ‌ట్టు మూడు వ‌న్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం ఆ దేశానికి రావ‌డంతో పాకిస్థాన్ క్రికెట్ ప్రేమికుల ఆనందానికి అవ‌ధుల్లేవు. శుక్ర‌వార‌మే తొలి వ‌న్డే జ‌ర‌గాల్సింది. కానీ ఈ మ్యాచే కాదు.. మొత్తం సిరీస్ ర‌ద్ద‌యిపోయింది. న్యూజిలాండ్ జ‌ట్టు ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని స్వ‌దేశానికి వెళ్లిపోయి పాకిస్థాన్‌కు దిమ్మ‌దిరిగే షాకిచ్చింది. భ‌ద్ర‌త కార‌ణాల‌తో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు న్యూజిలాండ్ వెల్ల‌డించింది.

పాకిస్థాన్‌లో ప్ర‌స్తుతం ప‌ర్య‌ట‌న అంత సుర‌క్షితం కాద‌ని.. త‌మ ఇంటెలిజెన్స్ వ‌ర్గాల నుంచి న్యూజిలాండ్ ప్ర‌భుత్వానికి హెచ్చ‌రిక‌లు రావ‌డం.. ఈమేర‌కు జ‌ట్టుకు స‌మాచారం రావ‌డంతో ఈ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని ఆట‌గాళ్లు స్వదేశానికి ప‌య‌న‌మ‌య్యారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఏం చేయాలో పాలుపోలేదు. అస‌లు స‌మ‌స్యేంటో చెప్ప‌కుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకుని ఎలా స్వ‌దేశానికి వెళ్లిపోతార‌ని ప్ర‌శ్నించినా ఫ‌లితం లేక‌పోయింది. పాకిస్థాన్లో క్రికెట్ పున‌రుజ్జీవం దిశ‌గా అడుగులు ప‌డుతున్న వేళ‌.. న్యూజిలాండ్ నిర్ణ‌యం ఆ దేశానికి మామూలు షాక్ కాదు. మున్ముందు మిగతా జ‌ట్లు కూడా వెనుకంజ వేయొచ్చు. కాగా ఇదంతా బీసీసీఐ చేసిన కుట్ర అంటూ పాకిస్థాన్ వాళ్లు సోష‌ల్ మీడియాలో ఇండియా మీద ప‌డి ఏడుస్తుండ‌టం గ‌మ‌నార్హం.