మహేష్, బన్నీ సినిమాలపై ట్యాక్స్ బాంబ్

టాలీవుడ్లో భారీ చిత్రాలు రిలీజైనపుడు పోస్టర్ల మీద కలెక్షన్ల లెక్కలు చాలా భారీగానే కనిపిస్తాయి. కానీ ఆ చిత్రాలకు కట్టే పన్నులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయని అంటారు. ఇదే విషయాన్ని లేవనెత్తుతూ రెండు బ్లాక్‌బస్టర్ చిత్రాలపై బాంబులు వేశారు ఏపీ మంత్రి పేర్ని నాని. సినీ పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందంటూ జగన్ సర్కారు మీద ఇటీవల తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం, సొంతంగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేయడం లాంటి నిర్ణయాలు దుమారం రేపుతున్నాయి.

ఈ నేపథ్యంలో పేర్ని నాని ప్రభుత్వం తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఈ విమర్శలపై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో గత ఏడాది సంక్రాంతికి రిలీజైన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలను ఉదాహరణగా చూపించారు రాని.

2019-20 వార్షిక సంవత్సరానికి తెలుగు సినిమాల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చిన పన్ను ఆదాయం రూ.39 కోట్లని నాని వెల్లడించారు. 13 జిల్లాల నుంచి ఏడాది వ్యవధిలో వచ్చిన అన్ని సినిమాలకు కలిపి వచ్చిన పన్ను ఆదాయం ఇంతే అన్నారాయన.

ఐతే అల వైకుంఠపురములో చిత్రానికి రూ.150 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని దాని హీరో చెప్పారని.. సరిలేరు నీకెవ్వరు సినిమాకు రూ.120-130 కోట్ల మధ్య ఆదాయం వచ్చినట్లు దాని హీరో చెప్పారని.. ఏపీ వరకు చూస్తే ఈ చిత్రాలు ఒక్కోటి రూ.85-90 కోట్ల మధ్య వసూళ్లు రాబట్టినట్లు అంచనా అని.. మొత్తంగా చూస్తే రూ.170 కోట్ల మేర ఈ రెండు చిత్రాలకు ఏపీ నుంచి ఆదాయం వచ్చినట్లుగా బాక్సాఫీస్ వెబ్ సైట్లో సైతం సమాచారం ఉందని నాని తెలిపారు. మామూలుగా టికెట్ రేటు రూ.100 దాటితే జీఎస్టీ 18 శాతమని, 10 లోపు ఉంటే 12 శాతమని.. సగటున ఒక్కో టికెట్ మీద ట్యాక్స్ 15 శాతం అనుకున్నా పాతిక కోట్లకు తక్కువ కాకుండా ఈ రెండు చిత్రాల నుంచే ప్రభుత్వాన్ని పన్ను ఆదాయం రావాలని.. కానీ మొత్తం ఏడాదికి రూ.39 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందంటే ఏదో తేడా జరుగుతోందనేగా అని నాని ప్రశ్నించారు.