ఆర్ ఆర్ ఆర్‌కు బిగ్ షాక్‌.. నెక్ట్స్ ఏంటి?

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఉర‌ఫ్ ఆర్ ఆర్ ఆర్‌కు ఫ‌స్ట్ షాక్ త‌గిలింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి వ్య‌తిరేకంగా.. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా.. ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న పోరాటంలో తొలిసారి ఆయ‌న‌కు తీవ్ర‌మైన ఎదురు దెబ్బ‌త‌గిలింది. దీంతో ఇప్పుడు ఆయ‌న నెక్ట్స్ ఏం చేయ‌ను న్నార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ.. కొన్నాళ్ల కింద‌ట హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లిలో ఉన్న సీబీఐ ప్ర‌త్యేక కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఇక‌, దీనిపై మ‌రో 24 గంట‌ల్లో తీర్పు వెలువ‌డుతుంద‌న‌గా.. మంగ‌ళ‌వారం తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్‌ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టును అభ్య‌ర్థించారు. దీనిపై జ‌రిగిన వాద‌న‌ల్లో.. అటు సీబీఐ, ఇటు ఎంపీ ర‌ఘురామ త‌ర‌ఫున న్యాయ‌వాదులు హోరా హోరీగా వాద‌న‌లు వినిపించారు. సీబీఐ కోర్టు బెయిల్ రద్దుపై తీర్పు వెలువ‌రించ‌కుండానే.. జ‌గ‌న్ సొంత మీడియా సాక్షికి చెందిన ట్విట్ట‌ర్‌లో బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను కోర్టు తోసిపుచ్చిందంటూ.. కొన్ని రోజుల కింద‌ట వార్త వ‌చ్చింది. అయితే.. దీనిని కొద్ది సేప‌టికి తొల‌గించారు. అయితే.. ఇది కోర్టు ధిక్కారం కింద చూడాలంటూ.. ఆర్ ఆర్ ఆర్ అదే సీబీఐ కోర్టులో పిటిష‌న్ వేశారు.

దీనిని విచారించిన కోర్టు.. జ‌గ‌న్ త‌ర‌ఫున లాయ‌ర్ల వాద‌న‌.. “అది ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన త‌ప్పుకాదు. ఒక ఉద్యోగి చేసిన త‌ప్పిదం” అని పేర్కొన్నారు. దీంతో స‌ద‌రు పిటిష‌న్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేప‌థ్యంలో సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పు కూడా దీనిపై ప్ర‌భావితం అవుతుంద‌ని.. తాను భావిస్తున్న‌ట్టు ర‌ఘురామ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే విచార‌ణ బెంచ్‌ను మార్చాల‌ని ఆయ‌న అభ్య‌ర్థిస్తూ.. తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వాద‌న‌ల అనంత‌రం.. తీర్పును రిజ‌ర్వ్ చేసిన న్యాయ‌మూర్తి.. తాజాగా తీర్పు వెలువ‌రించారు.

రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను తాజాగా తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రాఘురామ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు సంచ‌ల‌నంగా మార‌నుంది. ఏం జ‌రుగుతుందో చూడాలి.