ఆ ఇద్దరికీ త్రిష ఓకే చెబుతుందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రిష.. ఇక్కడ హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లింది. అక్కడ స్టార్ హీరోలతో రొమాన్స్ చేస్తూ బిజీ అయింది. ఆ తరువాత కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పుడు మరోసారి త్రిష పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగులో తెరకెక్కుతోన్న రెండు పెద్ద ప్రాజెక్ట్ లలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక చిరు సరసన హీరోయిన్ గా త్రిషను సంప్రదించారట. దాదాపు ఆ ఛాన్స్ ఆమెకే అని అంటున్నారు. గతంలో ఈ బ్యూటీ చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సమయంలో వీరిద్దరి జంటపై విమర్శలు వినిపించాయి. ఆ సినిమాలో చిరు కాస్త బొద్దుగా కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలేదు.

చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో కూడా హీరోయిన్ గా మొదట త్రిషనే అనుకున్నారు. కానీ ఆమె హ్యాండ్ ఇవ్వడంతో కాజల్ కి ఛాన్స్ దక్కింది. ఈసారి మాత్రం చిరు-త్రిష కాంబినేషన్ సెట్ అవ్వడం పక్కా అంటున్నారు. అలానే బాలయ్య సినిమాలో త్రిషను హీరోయిన్ గా అనుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా కమిట్ అయ్యారు.

వచ్చే నెలలో ఈ సినిమా మొదలుకానుంది. ఇందులో హీరోయిన్ గా త్రిష పేరును పరిశీలిస్తున్నారు. బాలయ్య నటించిన ‘లయన్’ సినిమాలో త్రిష హీరోయిన్ గా కనిపించింది. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. అయినప్పటికీ మరోసారి త్రిషను రంగంలోకి దింపాలనుకుంటున్నారు. మరి ఈ ఇద్దరు సీనియర్ హీరోలకు త్రిష గ్రీన్ ఇస్తుందేమో చూడాలి!