కన్ఫమ్.. ఆ సినిమాను ఆపేశారు

టాలీవుడ్లో పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలు కూడా అసూయ చెందేలా తన పెద్ద కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా లాంచ్ చేశాడు బెల్లంకొండ సురేష్. శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శీను’ మీద అప్పట్లోనే రూ.35 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు సురేష్. ఆ తర్వాత కూడా కొడుకు చిత్రాలకు ఎంతగా సపోర్ట్ చేస్తున్నాడో తెలిసిందే. శ్రీనివాస్ ఓ మోస్తరుగా నిలదొక్కుకున్నాక తన చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్‌ను లాంచ్ చేసే పనిలో పడ్డాడు సురేష్. గత ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కింది.

ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని డైరెక్షన్లో మొదలైన ఈ చిత్రాన్ని లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణు గోపాల్‌తో పాటు మరో కొత్త నిర్మాత టేకప్ చేశారు. సినిమా మొదలైనపుడే ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందు 50 శాతం చిత్రీకరణ కూడా పూర్తయింది. కానీ తర్వాత ఈ సినిమా గురించి అప్‌డేట్ లేదు.

మధ్యలో యుఎస్‌లో షూటింగ్ కోసం వీసాల విషయంలో ఏదో సమస్య వల్ల బ్రేక్ పడ్డట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఏ సమాచారం లేదు. మధ్యలో ఈ సినిమాను ఆపేసినట్లు గుసగుసలు వినిపించాయి. కానీ చిత్ర బృందం నుంచి చప్పుడు లేకపోయింది. ఇప్పుడు గణేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేకపోవడం చూస్తే ఈ ప్రాజెక్టు ఆగిపోవడం నిజమే అనిపిస్తోంది. గణేష్ సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చేస్తున్న కొత్త చిత్రం టైటిల్ రివీల్ చేశారు.

‘స్వాతిముత్యం’ అనే క్లాసిక్ టైటిల్ ఈ సినిమాకు పెట్టారు. అంతే కాక ‘ఇంట్రడ్యూసింగ్ బెల్లంకొండ గణేష్’ అంటూ పోస్టర్ మీద వేశారు. దీన్ని బట్టి గణేష్ అరంగేట్ర చిత్రం ఇదే అని ఖరారైంది. మరోవైపు ‘నాంది’ మేకర్స్ నిర్మాణంలో గణేష్ నటిస్తున్న మరో చిత్రం ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు. కానీ పవన్ సాధినేని సినిమా నుంచి మాత్రం ఏ సమాచారం లేదు. దీన్ని బట్టి ఆ చిత్రం ఆగిపోయిందన్నది స్పష్టమైంది.