ఒక్క పాట కోసం 15 కోట్లు 1000 లేడీ డాన్సర్లు

జవాన్ సినిమా విషయంలో షారుఖ్ ఖాన్ తగ్గేదేలే అంటున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. వచ్చే నెల ఆగస్ట్ మొదటి వారం నుంచి ప్రమోషన్లు మొదలుపెట్టబోతున్నారు. అందులో భాగంగా జిందా బందా అంటూ సాగే మొదటి ఆడియో సింగల్ రిలీజ్ చేస్తారు. దీని వెనుక చాలా విశేషాలున్నాయి. ఆరు రాష్ట్రాల నుంచి పిలిపించిన 1000కి పైగా లేడీ డాన్సర్లతో హీరో ఇంట్రో సాంగ్ గా చిత్రీకరించారు. శోభి డాన్స్ డైరెక్షన్ చేయగా అయిదు రోజుల పాటు చెన్నైలో షూట్ చేశారు. దీనికి అయిన ఖర్చు అక్షరాలా 15 కోట్ల రూపాయలు.

కింగ్ ఖాన్ కెరీర్లోనే ఇది అత్యంత ఖరీదైన పాటగా యూనిట్ చెబుతున్నారు. అనిరుద్ రవిచందర్ స్వరపరిచిన అదిరిపోయే పాటకు షారుఖ్ వేసిన స్టెప్పులు ఆశ్చర్యపరుస్తాయట. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, మధురై నుంచి ప్రత్యేకంగా పిలిపించిన లేడీ డాన్సర్లని చూసి మాస్ కి మతులు పోవడం ఖాయమని అంటున్నారు ఈ ఒక్క పాటకు పెట్టిన డబ్బుతో ఓ మీడియం రేంజ్ సినిమానే తీయొచ్చు. అలాంటిది ఇంత బడ్జెట్ అంటే మాటలు కాదు. అయితే బిజినెస్ పరంగా హక్కులు విక్రయించి ఎప్పుడో విపరీత లాభాలు అందుకున్న రెడ్ చిల్లీస్ బ్యానర్ పబ్లిసిటీని ఓ రేంజ్ లో చేయబోతోంది.

ఇంత హడావిడి జరిగే పాటలో హీరోయిన్లు నయనతార, దీపీకా పదుకునే ఉండరట. ఇదో ప్రత్యేకమైన సందర్భంలో వస్తుందని అంటున్నారు. ఇంతకన్నా డీటెయిల్స్ బయట పెట్టడం లేదు. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. నిజానికి ముంబైకర్ తో ఆల్రెడీ లాంచ్ అయినప్పటికీ  అది డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తు లేదు. దీంతో జవానే పరిచయ చిత్రంగా చెబుతున్నాడు. అంచనాలైతే ఎగబాకుతున్నాయి కానీ పఠాన్ ఇచ్చిన లక్ష్యాన్ని దాటుతుందో లేదో చూడాలి.