‘లవ్ స్టోరి’పై సమంత స్పందించింది.. కానీ


టాలీవుడ్లో దాదాపు నెల రోజుల నుంచి హాట్ టాపిక్ అంటే.. అక్కినేని నాగచైతన్య-సమంతల వచ్చిన గ్యాప్ గురించే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని నాలుగేళ్ల కిందట గోవాలో ఎంతో సందడి మధ్య పెళ్లి చేసుకుని.. వివాహానంతరం మోస్ట్ సెలబ్రెటెడ్ కపుల్‌గా కనిపించిన ఈ జంట.. విడిపోతోందన్న వార్త ఎవ్వరికీ రుచించలేదు. ముందు ఈ వార్త పట్ల సందేహాలు వ్యక్తం చేసిన జనాలు.. తర్వాతి పరిణామాలు చూసి ఇది నిజమే అయ్యుండొచ్చని నమ్మడం మొదలుపెట్టారు.

తన ట్విట్టర్ అకౌంట్లో పేరు పక్కన ఉన్న ‘అక్కినేని’ పదాన్ని తీసేసి సమంత ప్రభు అని పేరు మార్చుకోవడంతో పాటు చైతూ గురించి స్పందించడమే మానేసింది సామ్. ఇక చైతూ ఎలాగూ ఎప్పుడూ రిజర్వ్డ్‌గా ఉంటాడు కాబట్టి సమంత గురించి అసలు స్పందించలేదు. వీళ్లిద్దరూ విడాకుల దిశగా అడుగులు వేస్తున్నారని చాలా గట్టిగానే ప్రచారం జరుగుతోంది.

ఇలాంటి సమయంలో చైతూ కొత్త చిత్రం ‘లవ్ స్టోరి’ ట్రైలర్ రిలీజ్ కాగా.. కొన్ని గంటల పాటు సమంత నుంచి ఎలాంటి స్పందనా లేకపోయింది. దీని గురించి చర్చ జరుగుతుండగా సమంత ట్రైలర్‌పై ట్వీట్ చేసింది. ఇదొక ‘విన్నర్’ అని వ్యాఖ్యానిస్తూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పింది. ఐతే టీం అని చెప్పి ఊరుకుంటే సరిపోయేది కానీ.. ఆ ట్వీట్లో ఒక్క సాయిపల్లవిని మాత్రమే ట్యాగ్ చేసింది. చైతూ పేరు మాత్రం ట్యాగ్ చేయలేదు. దీన్ని బట్టి చైతూకు ఆమెకు మధ్య గ్యాప్ వచ్చిందన్నది స్పష్టమైపోయింది.

ఒకప్పుడు చైతూ సినిమాల ప్రోమోల పట్ల సమంత స్పందించే తీరే వేరుగా ఉండేది. ఇప్పుడు మాట మాత్రమైనా అతడి గురించి ఎత్తలేదంటే ఆమెకు, అతడికి చెడిందని అర్థమవుతోంది. త్వరలోనే చైతూ ‘లవ్ స్టోరి’ ప్రమోషన్ల కోసం మీడియాను కలవబోతున్నాడు కాబట్టి అప్పుడు సమంతతో తన బంధం గురించి అతను క్లారిటీ ఇస్తాడని భావిస్తున్నారు.