హౌస్ ఫుల్స్ గ్యారెంటీడ్


కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత థియేటర్లలోకి రాబోతున్న సినిమాల్లో అత్యధిక అంచనాలున్నది ‘లవ్ స్టోరి’ మీదే. ‘ఫిదా’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన పక్కా ప్రేమకథా చిత్రమిది. నాగచైతన్య-సాయిపల్లవిల క్రేజీ కాంబినేషన్ కూడా ఈ సినిమాకు ఆకర్షణే. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ఇతర ప్రోమోలో ప్రేక్షకుల్లో అంచనాలను బాగా పెంచేశాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెలుగు రాష్ట్రాల్లోని యువ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పటిదాకా థియేటర్లకు వెళ్లడం మానేసిన చాలామంది ప్రేక్షకుల్లో చాలామంది ఈ సినిమాతోనే థియేటర్లలోకి రీఎంట్రీ ఇవ్వాలని చూస్తుండటం విశేషం. వాళ్లందరి నిరీక్షణకు ఈ నెల 24న తెరపడబోతోంది.

‘లవ్ స్టోరి’ మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఈ రోజు రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఒక స్వచ్ఛమైన ప్రేమకథను చూడబోతున్నామన్న భావన కలిగించిందీ ట్రైలర్. చక్కటి ప్రేమ సన్నివేశాలకు తోడు.. ఎమోషన్లు బాగా పండినట్లుగా కనిపిస్తోంది. చైతూ, సాయిపల్లవి ఇద్దరూ కూడా కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినట్లున్నారు.

ఇప్పటికే ఉన్న అంచనాలను ఇంకా పెంచేసిన ‘లవ్ స్టోరి’.. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను కళకళలాడించబోతోందని స్పష్టమైంది. చివరగా ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడు అడ్వాన్స్ బుకింగ్స్ హోరెత్తిపోయాయి. టికెట్ల కోసం కొట్టుకునే పరిస్థితి అప్పుడే కనిపించింది. ప్రతి థియేటర్ దగ్గరా హౌస్ ఫుల్ బోర్డులు చూసింది చివరగా అప్పుడే. మరీ ఆ స్థాయిలో కాకపోయినా.. అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్ ఫుల్ బోర్డులతో మళ్లీ టాలీవుడ్లో సందడి తీసుకురాబోయే చిత్రం ‘లవ్ స్టోరి’ అన్నది స్పష్టమైపోయింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో లవ్ స్టోరికి బుకింగ్స్ ఓపెన్ చేయగా చకచకా టికెట్లు అమ్ముడైపోతున్నాయి.