ధనుష్ చేతుల్లో నాలుగు తెలుగు సినిమాలు!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అక్కడున్న యంగ్ హీరోల్లో ధనుష్ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. ముందుగా దర్శకుడు శేఖర్ కమ్ములతో సినిమా చేయబోతున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ నారాయణ్ దాస్ కె నారంగ్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దీని తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్.

ఈ రెండు సినిమాలను ఈ ఏడాదిలోనే మొదలుపెట్టబోతున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లు ధనుష్ తో సినిమాలు చేయబోతున్నారు. మైత్రి మూవీస్ బ్యానర్ లో చేయబోయే సినిమాకి దర్శకుడిగా అజయ్ భూపతిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

మరోపక్క డీవీవీ దానయ్య.. ధనుష్ కోసం దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. సరైన కథ సెట్ అయితే ధనుష్ తో సినిమా మొదలుపెట్టడం ఖాయం. ఇప్పటికే ధనుష్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి ధనుష్ టాలీవుడ్ లో నాలుగు సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాలతో ఇక్కడ స్టార్ హీరోలకు పోటీగా మారతాడేమో చూడాలి!