బండ్ల గణేష్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచారాలు మొదలుపెట్టేశారు. ఇక అధ్యక్ష బరిలో ఉన్నవారు తమ గెలుపు కోసం ఇప్పటినుండే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రకాష్ రాజ్ ‘మా’ కళాకారులను విందుకి ఆహ్వానించారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ విందు ప్రోగ్రామ్ ను బండ్ల గణేష్ తప్పుబట్టారు.

విందులు, సన్మానాల పేర్లతో ‘మా’ కళాకారులందరికీ ఒక దగ్గరకు చేర్చొద్దని అన్నారు. ఎందుకంటే గత రెండేళ్లలో అందరూ కరోనా భయంతో బ్రతుకుతున్నారని.. చాలా మంది చావు వరకు వెళ్లొచ్చారని.. అందులో తను ఒకడినని అన్నారు. ఓటు కావాలంటే ఫోన్ చేసి అడగాలని.. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసోసియేషన్ ఎన్నికలన్నాక.. అందరితో చర్చించడాలు.. క్యాంపెయినింగ్ అనేవి సర్వసాధారణంగా జరుగుతుంటాయని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు కొంతమంది ఆర్టిస్ట్ లను లంచ్ కు పిలిచానని.. వారితో సమస్యల గురించి చర్చించామని తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయని చెప్పారు. బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు తనను షాక్ కి గురి చేసినట్లు చెప్పారు. గుజరాత్ తో పాటు మరికొన్ని చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్నాయని.. అక్కడికి అందరూ వెళ్తున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. మరి దాని గురించి బండ్ల గణేష్ ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 19న వస్తుందని.. ఆ తరువాత అన్ని విషయాలు తెలియజేస్తానని పరోక్షంగా.. బండ్లను హెచ్చరించారు.