ఇంత చేస్తున్నా.. కేంద్రంపై సాయిరెడ్డి ప్రేమ ఒల‌క‌బోస్తున్నారే!

ఏపీకి సంబంధించిన అనేక స‌మ‌స్య‌ల‌పై కేంద్రంతో పోరాడాల్సిన అధికార పార్టీ వైసీపీ నాయ‌కులు.. ఇంకా బ‌తిమాలుతూనే ఉండ‌డంపై విమర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి సంబంధించిన ఒక్క స‌మ‌స్య‌ను కూడా ప‌రిష్క‌రించ‌క‌పోగా.. కొత్త స‌మ‌స్య‌లు సృష్టిస్తోంది. వీటిపై ఏమాత్రం స్పందించ‌ని ప్ర‌భుత్వం.. మ‌రోవైపు.. ఇంకా బ‌తిమ‌లాడ‌డంతోనే స‌రిపెడుతోంది. తాజాగా వైసీపీ కీలక నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి కేంద్రాన్ని బ‌తిమ‌లాడే ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించారు.

అంతేకాదు.. జ‌మ్ము క‌శ్మీర్ విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అనుస‌రించిన విధానాన్ని ఆయ‌న పొగ‌డ‌డం మ‌రింత విస్మ‌యానికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లకు 2021-22 బడ్జెట్‌లో అధిక కేటాయింపులు జరపడాన్ని సాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం కొనియాడింది. రాజ‌ధాని లేని ల‌ద్ధాఖ్‌కు నిధులు కేటాయించ‌డాన్ని ప్ర‌స్తుతించిన సాయిరెడ్డి.. ఈ విష‌యంలో కేంద్రాన్ని నిల‌దీయాల్సిన ప‌రిస్థితి ప‌క్క‌న పెట్టారు.

“మాక‌న్నా.. త‌ర్వాత ఏర్ప‌డిన ల‌ద్ధాఖ్‌పై ఎందుకంత ప్రేమ‌!” అని ఆయ‌న నిల‌దీయాల్సింది పోయి.. ల‌ద్ధాఖ్‌కు నిధులు కేటాయించ‌డాన్ని అభినందిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర విభజన సమయంలో రాజధానులను కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌లకూ ఇలాంటి పరిహారం ఇస్తే బాగుంటుందన్నది కమిటీ భావనగా పేర్కొన్నారు. ఈ మూడు రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా ప్రకటించాలని కమిటీ సిఫార్సు చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. దాని వల్ల ఆయా రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి, వాణిజ్యం, ఎగుమతుల మౌలిక వసతుల పరంగా ఆర్థికాభివృద్ధి చెందడానికి వీలవుతుందని ఆయ‌న తెలిపారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. సాయిరెడ్డి కేంద్రంపై ఫైట్ మానేసి.. బ‌తిమాలుతున్నారే! అని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు స‌టైర్లు పేలుస్తున్నారు. అంతేకాదు.. ఎందుకంత కేంద్రంపై ప్రేమ‌ను ఒల‌క‌బోస్తున్నార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విష‌యంలో ప‌ట్టుబ‌ట్ట‌డం మానేసి.. రెండున్న‌రేళ్లు గ‌డిచిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రూపాయి ప్ర‌త్యేక నిదుల కింద తీసుకురాలేక పోయారు. ప్ర‌త్యేక హోదా అంశం ఏనాడో మ‌రుగున ప‌డిపోయింది. ఇలాంటి అంశాల‌ను ప‌ట్టుబ‌ట్టి సాధించాల్సిన సాయిరెడ్డి.. వంటి కీల‌క నేత‌లు.. ఇంకా బ‌తిమాలుకునే ధోర‌ణిలోనే ముందుకు సాగ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలానే ఉంటే.. ప‌రిస్థితి మెరుగ‌య్యేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.