రేవంత్‌కు రాహుల్ అండ‌.. ఇక త‌గ్గేదేలే!

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీగా రేవంత్ రెడ్డి ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ జోరందుకుంది. రేవంత్ పిలుపు మేర‌కు కాంగ్రెస్‌ కార్య‌క‌ర్త‌లు శ్రేణులు ఉత్సాహంగా క‌దిలి వ‌చ్చి స‌భ‌లు ర్యాలీలు నిర‌స‌న‌ల్లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు. మొత్తానికి రేవంత్ వ‌చ్చాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇక రేవంత్ కూడా త‌న‌దైన దూకుడుతో అధికార కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేస్తూ దూసుకెళ్తున్నారు. తాజాగా ప్ర‌భుత్వ భూముల వేలంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఇక త‌న‌దైన శైలిలో చెల‌రేగుతున్న రేవంత్‌కు ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ అండ కూడా తోడైన‌ట్లు తెలుస్తోంది.

టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపిక‌ను మొద‌టి నుంచి ఆ పార్టీలోని రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కులు వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. కానీ రేవంత్‌పై న‌మ్మ‌క‌ముంచిన పార్టీ అధిష్ఠానం ఆయ‌న‌కే బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టింది. ఇది పార్టీలోని సీనియ‌ర్ల‌లో అసంతృప్తికి కార‌ణ‌మైంది. కొంత‌మంది బ‌హిరంగంగానే త‌మ అసంతృప్తికి వెళ్ల‌గ‌క్కితే మ‌రికొంత మంది సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం పార్టీ నాయ‌క‌త్వం ద‌గ్గ‌ర త‌మ గోడు వెళ్ల‌బోసుకున్న‌ట్లు తెలిసింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం సాధ్యం కాన‌ప్ప‌టికీ గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలు పొందాల‌నే ప్ర‌ణాళిక‌తో మాజీ మంత్రి కొండా సురేఖ‌ను అక్క‌డ బ‌రిలో దింపేందుకు రేవంత్ సిద్ధ‌మ‌యారు. కానీ అంద‌రితో చ‌ర్చింకుండా రేవంత్ నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని నాన్ లోక‌ల్ అయిన సురేఖ‌కు బ‌దులు స్థానిక నేత‌ల‌నే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీకి దింపాల‌ని రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు సీనియ‌ర్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో అభ్య‌ర్థిని ఎంపిక విష‌యంలో ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించి అభ్య‌ర్థి ఎంపిక చేయాల‌నే ప్ర‌క్రియ‌ను మొద‌లెట్టిన పార్టీ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డం ముగించింది.

కానీ కొండా సురేఖనే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని రేవంత్ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలిసింది. దీనిపై సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చిన‌ప్ప‌టికీ అధిష్ఠానంతో మాట్లాడి ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. తాజాగా అగ్ర నాయ‌కులు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి స‌హా రాష్ట్ర సీనియ‌ర్ నాయ‌కులు స‌మావేశ‌మ‌య్యారు. కొంత‌మంది నేత‌లు రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను రాహుల్ ముందు ఉంచ‌గా.. మ‌రికొంత మంది రేవంత్ రెడ్డిపై ప‌రోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్ర‌య‌త్నించార‌ని తెలిసింది. కానీ అంత‌కంటే ముందు మాణిక్యం ఠాగూర్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్న రాహుల్ గాంధీ.. రేవంత్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న నాయ‌కుల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ ప‌రిస్థితులు మెరుగుప‌డుతున్నాయ‌ని ఈ స‌మ‌యంలో ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదు చేసుకోవ‌డం స‌రికాద‌ని అంద‌రూ క‌లిసి ప‌నిచేయాల‌ని రాహుల్ చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో రేవంత్‌పై అసంతృప్తి వ్య‌క్తం చేసిన సీనియ‌ర్ నాయ‌కుల‌కు చెక్ చెప్పిన‌ట్ల‌యింది.