పతనం మొదలైంది.. రషీద్ ఖాన్ రాజీనామా


అఫ్ఘానిస్థాన్ దేశం తాలిబన్ల చేతికి చిక్కగానే అతడి ప్రజల భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఒక పర్యాయం తాలిబన్ల పాలన రుచిచూడటం.. గత రెండు దశాబ్దాల అంతర్యుద్ధ సమయంలో తాలిబన్ల అరాచకాలపై బాగా అవగాహన ఉండటంతో అక్కడి జనాలు పూర్తిగా నైరాశ్యంలోకి కూరుకుపోయారు. ఆ క్రమంలోనే దేశం విడిచి వెళ్లిపోవడానికి విఫలయత్నం చేస్తున్నారు.

ఇక అఫ్గానిస్థాన్ క్రీడల పరిస్థితి దారుణంగా మారబోతోందన్న అంచనాలు మొదలైపోయాయి. ఇప్పటికే మహిళలు ఏ ఆటలూ ఆడకూడదంటూ ఆంక్షలు పెట్టి వాళ్ల కాళ్లకు బంధనాలు వేసేశారు. అఫ్గాన్లో ఆటలు ఆడే అమ్మాయిలందరూ దేశం విడిచి వెళ్లిపోవడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్రికెట్లో వేగంగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ జట్టు భవితవ్యంపైనా ఆందోళన వ్యక్తమైంది. తాలిబన్ల చేతికి వెళ్లనున్న అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆట మీద ఏమాత్రం దృష్టిపెడుతుందో అన్న సందేహాలు కలిగాయి.

అందుకు తగ్గట్లే పరిణామాలు కూడా వేగంగా మారిపోయాయి. శ్రీలంకలో పాకిస్థాన్‌తో అఫ్గానిస్థాన్ ఆడాల్సిన వన్డే సిరీస్ ఆల్రెడీ వాయిదా పడింది. ఇక టీ20 ప్రపంచకప్ కోసం జట్టునైతే ఎంపిక చేశారు కానీ.. అది తాలిబన్ల మార్గదర్శకాల్లోనే జరిగిందని స్పష్టమైపోయింది. జట్టు ఎంపిక సందర్భంగా కనీసం జట్టు కెప్టెన్‌ను సంప్రదించనేలేదట. ఆ జట్టు టీ20 సారథి ఎవరో కాదు.. భారతీయులకు ఎంతో ఇష్టమైన రషీద్ ఖాన్. తన ప్రమేయం లేకుండా జట్టును ఎంపిక చేయడం.. తనను మాటకైనా సంప్రదించకపోవడంతో అతను ఆవేదన వ్యక్తం చేస్తూ టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు.

జట్టు సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని.. టీ20 ప్రపంచకప్ ఆడతానని అతను స్పష్టం చేశాడు. ఐతే ఆత్మాభిమానం ఉన్న రషీద్ ఖాన్ లాంటి ఆటగాళ్లు ఆ జట్టులో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని.. ప్రపంచవ్యాప్తంగా అనేక టీ20 లీగ్‌ల్లో మంచి డిమాండ్ ఉన్న రషీద్ ఇకపై అఫ్గానిస్థాన్‌లో ఉండే అవకాశాలు తక్కువ అని.. అతడి లాగే మిగతా ఆటగాళ్లూ ప్రత్యామ్నాయాలు చూసుకుంటారని.. దేశం విడిచి వెళ్లిపోవడం, క్రమంగా అఫ్గాన్ క్రికెట్‌కు దూరం కావడం.. ఆ జట్టు పతనం కావడం లాంఛనమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.