కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవిపై గవర్నర్ అసంతృప్తి..!

కీలకమైన హుజురాబాద్‌ ఉప ఎన్నికల హీట్ నడుస్తున్న సమయంలో.. కాంగ్రెస్ నుంచి అధికారిక టీఆర్ఎస్ కి జంప్ చేసిన నేత కౌశిక్ రెడ్డి. టీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ అభ్యర్థిగా ఎంపిక అవుతాననే నమ్మకంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్లారు. కానీ.. ఆ ఛాన్స్ ఇవ్వకుండా.. ఆ వెంటనే కొద్దిరోజుల్లోనే గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్‌.. దీనిపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్‌.. గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. కేసీఆర్‌పై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది..

తెలంగాణ గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. కౌశిక్‌ రెడ్డి ఫైల్‌ విషయంపై కూడా స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేసిన ఫైల్‌ నా దగ్గరే ఉందన్న గవర్నర్‌ తమిళిసై.. నేను ఇంకా ఒకే చెప్పలేదన్నారు..ఈ ఫైల్‌పై నాకు సమయం కావాలని వ్యాఖ్యానించారు. ఇది గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ కాబట్టి… తాను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు తమిళిసై.

అయితే, హుజురాబాద్ ఉప ఎన్నిక వరకు ఆపుతారా? అంటూ అడిగిని మరో ప్రశ్నకు స్పందిస్తూ.. మీరు ఏమైనా ఊహించుకోండి.. కానీ, నేను ఆ ఫైల్‌ను స్టడీ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో.. పాడి కౌశిక్‌ రెడ్డిని అసలు ఎమ్మెల్సీగా నియమించేందుకు గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా? లేదా? అనేది టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీగా ఉన్న గోరెటి వెంకన్న గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ అయ్యారు. ప్రభుత్వం ఫైల్ పంపిన కొద్దిరోజులకే…గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. కానీ..కౌశిక్ రెడ్డి విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారనేది టీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కలేదు. కౌశిక్ రెడ్డి సోషల్ వర్క్ చేస్తున్నారా ? అనేది చూస్తున్నట్లు, మ్యాటర్ స్టడీ చేయడం జరగుతోందని గవర్నర్ తమిళిసై వెల్లడించడం గమనార్హం.