ఏపీ చ‌వితి వివాదంపై ప‌వ‌న్ ఘాటు స్పంద‌న‌

ఈ మ‌ధ్య త‌ర‌చుగా ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో నిల‌వ‌డం ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారుకు అల‌వాటుగా మారిపోయింది. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకుంటున్న చాలా నిర్ణ‌యాలు వివాదాస్ప‌దం అవుతున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో వినాయ‌క చ‌వితి సంబ‌రాలకు అనుమ‌తి నిరాక‌రిస్తూ ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు ఆ పండుగ‌ను సెంటిమెంటుగా భావించే హిందువుల‌కు రుచించ‌డం లేదు. క‌రోనా ప్ర‌భావం చాలా వ‌ర‌కు త‌గ్గిన నేప‌థ్యంలో కొన్ని ప‌రిమితుల మ‌ధ్య పండుగ జ‌రుపుకుంటామ‌ని జ‌నాలు అంటుంటే.. అస‌లు వేడుక‌లే వ‌ద్దంటూ ప్ర‌భుత్వం ష‌ర‌తులు పెట్ట‌డంపై వివాదం రాజుకుంది.

ముఖ్యంగా వినాయ‌కుడి విగ్ర‌హాలు అమ్ముతున్న చిరు వ్యాపారుల ప్ర‌భుత్వ అధికారులు జులుం చూపించ‌డం.. గుంటూరులో ఒక చోట దేవుడి విగ్ర‌హాల‌ను స్వాధీనం చేసుకుని చెత్త త‌ర‌లించే వాహ‌నంలో తీసుకెళ్ల‌డం జ‌నాల‌కు తీవ్ర ఆగ్ర‌హం తెప్పించింది. ప్ర‌భుత్వ తీరు తీవ్ర వివాదాస్ప‌ద‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా దీనిపై స్పందించారు.

కొవిడ్ పేరు చెప్పి వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై నిషేధం విధించ‌డాన్ని ప‌వ‌న్ త‌ప్పుబ‌ట్టాడు. ప‌క్క రాష్ట్రాల్లో కొన్ని ష‌ర‌తుల మ‌ధ్య చ‌వితి ఉత్స‌వాలు జ‌రుగుతున్న‌పుడు, ప్ర‌భుత్వం అనుమ‌తులు ఇస్తున్న‌పుడు ఏపీలో మాత్రం ఈ నియంత్ర‌ణ ఏమిట‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు.

వైఎస్సార్ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల‌తో పాటు అధికార పార్టీ నాయ‌కులు ఏ వేడుక‌ల్లో పాల్గొన్నా, వాళ్లు ఏం చేయాల‌నుకున్నా క‌రోనా అడ్డం కాద‌ని.. వాటికి అనుమ‌తులు వ‌స్తాయ‌ని.. కానీ మ‌న సంస్కృతిలో భాగ‌మైన‌ వినాయ‌క చ‌వితి చేసుకోవాలంటే మాత్రం క‌రోనాను చూపిస్తున్నార‌ని.. ఇలా ప‌క్ష‌పాతం ప్ర‌ద‌ర్శించ‌డం ఎంత వ‌ర‌కు న్యాయ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు. కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు అన్నింటికీ ఒకేలా ఉండాల‌ని.. ఇలా ఒక్కో దానికి ఒక్కో ర‌క‌మైన నిబంధ‌న‌లు స‌రికాద‌ని.. వినాయ‌క చ‌వితిని కొన్ని ష‌ర‌తుల మ‌ధ్య జ‌రుపుకునేలా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశాడు.