2020 ముంచేసింది.. 2021 పై పడ్డారు

2020పై అంద‌రిలాగే సినిమా వాళ్లూ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఆరంభంలో మురిపించి ఆ త‌ర్వాత తేల్చేసింది 2020. క‌రోనా పుణ్య‌మా అని మొత్తం ఇండ‌స్ట్రీనే మూత‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. నెలో రెండు నెల‌లో ఈ ప్ర‌భావం ఉంటుంది.. ఆ త‌ర్వాత ప‌రిస్థితి మారుతుందిలే అని ఆశిస్తే అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు.

ఈ ఏడాదంతా ఇక థియేట‌ర్ల‌లో బొమ్మ‌ప‌డ‌టం క‌ష్టంగానే ఉంది. ప‌డ్డా కూడా మునుప‌టిలా రెవెన్యూ రావ‌డ‌మూ క‌ష్ట‌మే. అందుకే ఇప్ప‌టికే విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాల‌ను ఓటీటీల‌కు ఇచ్చేస్తున్నారు. బాలీవుడ్లో ఈ ఒర‌వ‌డి బాగా క‌నిపిస్తోంది. అక్క‌డ పెద్ద పెద్ద సినిమాల‌నే ఓటీటీల్లోకి వ‌దిలేస్తున్నారు. అలా చేతులు దులుపుకుని 2021 మీద దృష్టిసారించారు.

హిందీ సినిమాలు దేశం మొత్తం విడుద‌ల‌వుతాయి కాబ‌ట్టి రిలీజ్ డేట్ల విష‌యంలో క్లాష్ రాకుండా చాలా ముందే బెర్తులు ఫిక్స్ చేసుకుంటారు. 2021కి సంబంధించి పెద్ద సినిమాల‌న్నీ దాదాపుగా రిలీజ్ డేట్ల‌ను ఖ‌రారు చేసుకున్నాయి. వివిధ సీజ‌న్ల‌కు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. ముందుగా రిప‌బ్లిక్ డే వీకెండ్‌కు అక్ష‌య్ కుమార్ సినిమా బ‌చ్చ‌న్ పాండేను ఫిక్స్ చేశారు.

ఆ త‌ర్వాత వేస‌విలోనూ ముందు అక్ష‌య్ మూవీ బెల్‌బాట‌మ్‌యే రాబోతోంది. ఈ ఏడాది క్రిస్మ‌స్‌కు రావాల్సిన ఆమిర్ ఖాన్ సినిమా లాల్‌సింగ్ చ‌ద్దాను వేస‌వికే రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తాజా స‌మాచారం. ఈసారి రంజాన్‌ను మిస్ చేసుకున్న స‌ల్మాన్ ఖాన్.. రాధె చిత్రాన్ని ఈద్‌కు తీసుకురాబోతున్నాడ‌ట‌.

ఇక అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమా మైదాన్‌ను ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. క్రిస్మ‌స్ వీకెండ్లో క‌ర‌ణ్ జోహార్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ త‌క్త్ రిలీజ్ చేయ‌నున్నారు. దీపావ‌ళికే ఇంకా ఏ పెద్ద సినిమా ఖ‌రార‌వ్వ‌లేదు. స‌ల్మాన్ మ‌రో సినిమా క‌భీ ఈద్ క‌భీ దివాళి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.