రూ.10వేల కోట్ల చెల్లింపులకు రూ.లక్ష కోట్ల వసూళ్లా?

బాదితే అలా ఇలా కాదు. మళ్లీ చరిత్రలో ఇంకెవరూ కూడా మర్చిపోలేనట్లుగా బాదేయటం.. దానికి దేశభక్తిని లింకు పెట్టే వైనం చూస్తే.. మోడీ సర్కారు తెలివికి ముచ్చట పడాల్సిందే. అప్పులు చేసినప్పుడు తిరిగి చెల్లించక తప్పదు. అప్పులు చేసేటప్పుడు ఉండే జోష్.. తిరిగి చెల్లించేటప్పుడు ఉండదన్నది అందరికి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎదురైన అనుభవం.. ప్రభుత్వ పరంగా చూసినప్పుడు అలానే ఉంటుంది. గత ప్రభుత్వాలు చేసే అప్పులకు ప్రస్తుత ప్రభుత్వాలు ఎంత భారీగా వసూలు చేస్తాయన్న విషయాన్ని మోడీ సర్కారు దేశ ప్రజలకు మరింత అర్థమయ్యేలా చేసింది.

ప్రభుత్వాలు అప్పులు చేస్తే సరిపోదని.. ప్రజలకు ఎదురయ్యే తిప్పలన్ని తర్వాతి రోజుల్లో ఉంటాయన్న విషయాన్ని ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్న పరిస్థితి. యూపీఏ ప్రభుత్వం పెట్రో బాండ్ల పేరుతో రూ.1.34 లక్షల కోట్లను సేకరించింది. దీనికి సంబంధించిన చెల్లింపులు ఈ ఏడాది నుంచే మొదలు కానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో చమురు బాండ్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10వేల కోట్లు. అలాంటప్పుడు సరిగ్గారూ.10వేల కోట్లు కాకున్నా.. రూ.12 వేల కోట్లు వచ్చేలా ప్లాన్ చేయటాన్ని ఎవరూ ఏమీ అనలేరు. చేసిన అప్పును తీర్చాల్సిన వేళ.. ఆ కష్టమేదో ప్రజలు పడాల్సిందే.

మరి.. కేంద్రంలోని మోడీ సర్కారు ఏం చేసింది? ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.10వేల కోట్ల మొత్తాన్ని వసూలు చేయటం కోసం ప్రజల మీద పెట్రోల్ ధరల్ని పెంచుకుంటూ పోయింది. పెరిగిన ధరలతో పెట్రో ఉత్పత్తుల మీద అదనంగా ఈ ఏడాది వచ్చే ఎక్సైజ్ ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాల లక్ష కోట్లుగా చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.33వేల కోట్ల మేర వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అంటే.. అప్పులకు చెల్లించాల్సిన రూ.10వేల కోట్లకు బదులుగా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్న వైనం చూస్తే.. మోడీ సర్కారు తీరు ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది.

పెట్రోల్.. డీజిల్ ధరల్ని ఇప్పుడున్నంత భారీగా పెంచాల్సిన అవసరం లేదు. కానీ.. పన్ను ఆదాయం మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం.. ముక్కు పిండి వసూలు చేస్తోంది. అదేమంటే.. ఇలా వసూలు చేసిన పన్నులతో రక్షణ సామాగ్రిని కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఆ వాదన నిజమే అనుకుందాం? మరి.. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పలు పోర్టులు.. రోడ్లు ఇలా అన్నింటిని అమ్మేయటం దేని కోసం? అన్నది ప్రశ్న.

ఈ ఏడాది చమురు బాండ్ల మీద రూ.10వేల కోట్లు చెల్లించాలంటే అదనంగా బాదేసిన మోడీ సర్కారు..రానున్న సంవత్సరాల్లో చెల్లించాల్సిన మొత్తాలు చూసినప్పుడు చెమటలు పట్టక మానదు. ఎందుకంటే.. 2023-24లో రూ.31,150 కోట్లు, 2024-25లో రూ.52,860.17 కోట్లు, 2025-26లో రూ.36,913 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన ప్రజల మీద పడే పన్ను పోటు ఏ రేంజ్లో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి.. ప్రజల అంచనాలకు తగ్గట్లే బాదేస్తారా? లేదంటే కాస్త రిలీఫ్ ఇస్తారా? అన్నది కాలమే బదులివ్వాలి.