కంగన ఎటాక్.. పీవీఆర్ సమాధానం

వాయిదాల మీద వాయిదాలు ఎన్నో నెలల నుంచి విడుదల కోసం చూస్తున్న భారీ చిత్రం ‘తలైవి’ ఇంకో ఐదు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధం చేశారు.

వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్ర హిందీ వెర్షన్‌ థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయబోతుండటం పట్ల పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ సినిమాను తమ థియేటర్లలో ప్రదర్శించబోమని ప్రకటించడం తెలిసిందే.

దీనిపై కంగనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పీవీఆర్, ఐనాక్స్‌లను తీరును తప్పుబట్టింది. థియేటర్లకు ప్రేక్షకులు రాక కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికే నిర్మాతలు సంకోచిస్తున్న సమయంలో ఇలా ఆంక్షలు పెట్టడమేంటని విమర్శించింది.

ఐతే కంగనా ఎటాక్ నేపథ్యంలో పీవీఆర్ స్పందించింది. ‘తలైవి’పై పెట్టిన ఆంక్షల విషయంలో సడలింపులు ఇచ్చింది. తెలుగు, తమిళ వెర్షన్లను ఓటీటీలో నెల రోజుల వ్యవధి తర్వాత విడుదల చేయనున్న నేపథ్యంలో వాటిని మాత్రం పీవీఆర్ థియేటర్లలో ప్రదర్శిస్తామని చెప్పింది. హిందీ వెర్షన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.

గతంలో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎనిమిది వారాలకే ఓటీటీలో రిలీజ్ చేయాలని తాము షరతు పెట్టామని.. ఆపై మారిన పరిస్థితుల దృష్ట్యా నాలుగు వారాల గ్యాప్‌కు అంగీకరించామని.. కానీ ‘తలైవి’ హిందీ వెర్షన్‌కు ఈ గ్యాప్ మరీ రెండు వారాలకు తగ్గించడం తమకు ఆమోదయోగ్యం కాదని.. అందుకే ఆ చిత్రాన్ని హిందీలో తాము దేశంలో ఎక్కడా ప్రదర్శించబోమని పీవీఆర్ స్పష్టం చేసింది.

కరోనా దెబ్బ కొట్టినా.. ఇంత కాలం ఆగి థియేటర్లలోనే ‘తలైవి’ని రిలీజ్ చేయాలనుకోవడం అభినందనీయమే అని.. కానీ మంచి అంచనాలున్న ఈ చిత్రాన్ని రెండు వారాలకే హిందీలో ఓటీటీలో రిలీజ్ చేయడం మాత్రం సమంజసం కాదని పీవీఆర్ పేర్కొంది.