జగన్ ది అనాలోచిత నిర్ణయమేనా ?

వినాయక చవితి వేడుకలు బహిరంగ వేదికపై నిర్వహించుకోవటాన్ని ప్రభుత్వం అభ్యంతరం పెట్టిన విషయం తెలిసిందే. తన అభ్యంతరానికి కరోనా వైరస్ సమస్యను ప్రభుత్వం చెప్పింది. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అనాలోచితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సమస్య నియంత్రణలోనే ఉందని ఒకవైపు చెబుతున్న ప్రభుత్వం మరోవైపు వర్తక, వాణిజ్య సముదాయాలు తెరవడానికి అనుమతిస్తోంది. అలాగే స్కూళ్ళు కూడా తెరిచేసింది. హోటల్, రెస్టారెంట్లతో పాటు చివరకు బార్లను కూడా బార్లా తెరుచుకోవడానికి అనుమతించింది.

దేవాలయాలు, మసీదులు, చర్చిలు కూడా ఓపెన్ అయిపోయాయి. మరి ఇన్నింటికి లేని కరోనా వైరస్ సమస్య ఒక్క వినాయక చవితి వేడుకలకు మాత్రమే అడ్డొచ్చిందా ? బహిరంగ వేదికలపైన చవితి వేడుకలు నిర్వహించటమన్నది దశాబ్దాలుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. బహిరంగ వేదికలపై వేడుకలు వద్దని చెప్పకుండా కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పి వేడుకలకు అనుమతిస్తే బాగుండేది. ప్రభుత్వం షరతులు విధించినా విధించకపోయినా జనాలు చేసేది చేసేదే. ఈ మాత్రం దానికి జనాలతో గొడవలు పడాల్సిన అవసరం ఏమిటో జగన్ కాస్త ఆలోచించాలి.

ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోగానే వ్యతిరేకించడానికి ప్రతిపక్షాలు రెడీగా ఉంటాయి. ప్రభుత్వం వద్దంటే ప్రతిపక్షాలు కచ్చితంగా చేయాల్సిందే అని గట్టిగా పట్టుబడతాయి. ఇపుడు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసింది కూడా అదే. బహిరంగ వేదికలపై చవితి వేడుకల వద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వీర్రాజు తప్పు పడుతున్నారు. కారణం ఏమిటంటే ప్రభుత్వం హిందూ వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుంటోందట. హిందు ధర్మం, దేవాలయాలు, సంస్కృతిపై జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందనే వాదన వినిపించారు.

అయితే వీర్రాజు వేసిన ఓ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. కరోనా వైరస్ ఉన్నపుడు కూడా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలా ప్రయత్నించింది ? అని నిలదీశారు. ఒకవైపు పబ్లిక్ ప్లేసెస్ అన్నింటినీ ఓపెన్ చేయిస్తు చవితి వేడుకలను మాత్రం ఇళ్ళల్లోనే జరుపుకోవాలని చెప్పడం వెనుక హిందూమత వ్యతిరేక కుట్ర ఉందని ఆరోపించారు .

ప్రభుత్వంపై ప్రతిపక్షాలు హిందూ వ్యతిరేకత ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి అవకాశాలను జగన్ ముందుగానే అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇపుడు వినాయక చవితి వేడుకల విషయంలో కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటే బాగుంటుంది. వేడుకలు బహిరంగంగా జరుపుకోకూడదని ప్రభుత్వం పట్టుబడితే ప్రతిపక్షాలు దాన్ని ఉల్లంఘించేదుకు రెడీగా ఉంటాయి. జగన్ కు ఇవన్నీ అవసరమా ? కాబట్టి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటే సరిపోతుంది.