పీకే.. కాంగ్రెస్‌కే కాదు అస‌లు రాజ‌కీయాల‌కే ఇప్పుడు దూరం

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా గొప్ప పేరు తెచ్చుకున్న ప్ర‌శాంత్ కిషోర్ (పీకే) ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నే త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నారా? ఆయ‌న ఇప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీలో చేర‌డం లేదా? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది కాలం పాటు ఈ రాజ‌కీయాలు.. ఎన్నిక‌ల గొడ‌వ నుంచి ఆయ‌న దూరంగా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని కావ‌డంలో కీల‌క పాత్ర పోషించిన పీకే పేరు ఒక్క‌సారిగా మార్మోగింది. ఆ త‌ర్వాత వివిధ రాష్ట్రాల ఎన్నిక‌ల్లోనూ ఆయా పార్టీల విజ‌యం కోసం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన ఆయ‌న ఎక్కువ శాతం విజ‌యాల‌నే సాధించారు. మోడీ ప్ర‌భ‌ను త‌ట్టుకుని ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీని తిరిగి గెలిపించ‌డం అందులో ముఖ్య‌మైంది. ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్‌ను అటు త‌మిళ‌నాడులో స్టాలిన్‌ను సీఎం గ‌ద్దెపై కూర్చొబెట్ట‌డంలో ఆయ‌న వ్యూహాలు ప్ర‌ముఖ పాత్ర పోషించాయి.

ప‌శ్చిమ బంగాల్ ఎన్నిక‌ల అనంత‌రం ఈ ఎన్నిక‌లు రాజ‌కీయ క్షేత్రం నుంచి కొంత కాలం విరామం తీసుకుంటాన‌ని పీకే ప్ర‌క‌టించాడు. కానీ ఆయ‌న ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూట‌మికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తార‌నే వార్త‌లు వినిపించాయి. అందుకు త‌గ్గ‌ట్లుగానే మోడీకి వ్య‌తిరేకంగా ఏక‌మ‌వాల‌నే ఉద్దేశంతో ఉన్నప్ర‌ధాన పార్టీల నేత‌ల‌తో ఆయ‌న వ‌రుసగా స‌మావేశ‌మ‌య్యారు. తృణ‌ముల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఎన్సీపీ అధినాయ‌కుడు శ‌ర‌ద్ ప‌వార్‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక చివ‌ర‌కు ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో చేర‌తార‌నే ప్ర‌చార‌మూ జోరుగా సాగింది. ఆ మేర‌కు ఆయ‌న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీతో మాట్లాడార‌ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో స‌మావేశ‌మ‌య్యార‌నే వార్త‌లు వ‌చ్చాయి.

వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ విజ‌యం కోసం ప‌ని చేసే దిశ‌గా పీకే అడుగులు ప‌డుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఆయ‌న కాంగ్రెస్ పార్టీలో రాజ‌కీయ స‌ల‌హాదారుగా కీల‌క పాత్ర ఆశిస్తున్నార‌నే వ్యాఖ్య‌లూ వినిపించాయి. కానీ పీకేను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌లు సోనియా గాంధీకి స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో స‌మూల ప్ర‌క్షాళ‌న అవ‌స‌రం అని భావిస్తున్న 23 మంది సీనియ‌ర్ నేత‌లు పీకే విష‌యంపై వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మైంది. దీంతో పీకేను చేర్చుకునే విష‌యంపై సోనియా గాంధీ అంతిమ నిర్ణ‌యం తీసుకునే వీలుంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

కానీ ఇప్పుడా అంచ‌నాలు విశ్లేష‌ణలు ఏవీ కూడా వాస్త‌వ రూపం దాల్చే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో పీకే చేర‌తార‌నే ప్ర‌చారానికి ఆయ‌న‌కు చెందిన ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ ఐ-ప్యాక్ తెర‌దించింది. పీకే కాంగ్రెస్లో చేర‌ట్లేద‌ని ఏ పార్టీకి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేయ‌డం లేద‌ని ఆ క‌మిటీ స్ప‌ష్టం చేసింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు కూడా ఆయ‌న దూరంగా ఉంటార‌ని వెల్ల‌డించింది. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత కొద్ది కాలం విరామం తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు పేర్కొంది. కాంగ్రెస్‌లోని సీనియ‌ర్ల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో పీకేను పార్టీలో చేర్చుకునే విష‌యంలో సోనియా గాంధీ సందిగ్ధంలో ప‌డ్డార‌ని అందుకే ఇప్ప‌ట్లో ఆయ‌న పార్టీలో చేరే అవ‌కాశం లేద‌ని ప్ర‌క‌టించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ వ్యూహ‌క‌ర్త అయిన పీకే ఇలా దూరంగా ఉండాల‌నుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.