నిరుద్యోగులకు ప్రభుత్వం షాక్

ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిపెంపు విషయంలో నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద షాకే ఇచ్చింది. వయోపరిమితిని 5 ఏళ్ళ సడలింపులో ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు మాత్రమే వర్తించేట్లుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తాజా నిర్ణయం వల్ల ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్ధులు దారుణంగా దెబ్బతినబోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వయోపరిమితి పెంచినట్లే తమకు కూడా పెంచాలని పై క్యాటగిరీల నిరుద్యోగులు ఎంత అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఓసీలకు ఐదేళ్ళు వయోపరిమితిని పెంచాలని ఎప్పటినుండో డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళకు గనుక 5 ఏళ్ళు వయోపరిమితి పెంచితే మిగిలిన క్యాటగిరీల వాళ్ళకు ఆటోమేటిక్ గా పెరుగుతుందట. ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు పెంచినంత మాత్రాన అందరికీ వర్తించదు. ఇదే విషయాన్ని నిరుద్యోగులు ఎంతగా మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటమే కష్టమైపోతోంది. చేసే కొద్ది ఉద్యోగాల విషయంలో కూడా ఒకళ్ళకు వయోపరిమితి పెంచటం, మరికొందరికి పెంచకపోవటంతో నిరుద్యోగులు మండిపోతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులకు వయోపరిమితిని పెంచుతానని పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఇపుడేమో తమ హామీకి తానే తూట్లు పొడుస్తున్నట్లు ఆదేశాలు జారీచేశారు. అసలే పెన్షన్ విధానం సీపీఎస్ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు ఇబ్బందులు పెడుతుంటే ఇపుడు నిరుద్యోగులు కూడా వాళ్ళకు జత కలిశారు. వయోపరిమితిని సడలిస్తే అందరికీ పెంచుండాలి లేకపోతే ఎవరికీ పెంచకపోయినా ఏదోలా సర్దుకుంటారు. కానీ రెండు క్యాటగిరీలకు మాత్రం పెంచి మిగిలిన మూడు క్యాటగిరీలకు పెంచకపోవటం అన్యాయమనే చెప్పాలి.

ఉద్యోగాల భర్తీ విషయంలో చంద్రబాబునాయుడు హయాం నుండే నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోంది. అదిపుడు జగన్ ప్రభుత్వంలో మరింతగా పెరుగుతోంది. నిజానికి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అనేది దాదాపు ఉండదనే చెప్పాలి. పోలీసు, వైద్య శాఖల్లాంటి అత్యంత ప్రాధాన్యత కలిగిన శాఖల్లో తప్ప మిగిలిన విభాగాల్లో దాదాపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలోనే ఉద్యోగాల భర్తీకే ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి సమయంలోనే భర్తీచేసే ఆరాకొరా ఉద్యోగాల విషయంలో కూడా వయోపరిమితి పెంపు వివాదమవుతోంది.