త్రిష పెళ్లి.. ఈసారి ఖాయమేనట

సౌత్ ఇండియా ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ హీరోయిన్లలో త్రిష ఒకరు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా పలు భాషల్లో ఆమె కథానాయికగా నటించింది. తమిళం, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పెద్ద రేంజికి చేరుకుంది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ ఆమెది. ఐతే కెరీర్లో తొలి పదేళ్లు తిరుగులేని హవా సాగించిన త్రిష.. చాలా ఏళ్ల నుంచి నామమాత్రంగానే కెరీర్‌ను నడిపిస్తోంది.

కెరీర్లో కొంచెం జోరు తగ్గినప్పటి నుంచి త్రిష పెళ్లి గురించి చర్చ జరుగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట వరుణ్ మణియన్ అనే నిర్మాతతో ఆమె నిశ్చితార్థం చేసుకోవడం.. ఇక పెళ్లే తరువాయి అనుకున్నాక అతడి నుంచి విడిపోవడం తెలిసిందే. ఆ తర్వాత కూడా త్రిష పెళ్లి చేసుకోబోతోందంటూ మళ్లీ మళ్లీ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నిజంగా పెళ్లయితే జరగలేదు.

ఐతే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో మరోసారి త్రిష పెళ్లి వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఒక వ్యాపారవేత్తతో ఆమె పెళ్లి నిశ్చయం అయిందని.. అందుకే త్రిష కొత్తగా సినిమాలేవీ అంగీకరించడం లేదని.. త్వరలోనే తన పెళ్లి గురించి త్రిష ప్రకటన చేయనుందని అంటున్నారు. ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్మెంట్లన్నీ పూర్తి చేసి.. సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో త్రిష ఉన్నట్లుగా కూడా చెబుతున్నారు. కొన్నేళ్లుగా త్రిష ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలే చేస్తోంది.

ఆమె లీడ్ రోల్ చేసిన నాయకి, మోహిని లాంటి చిత్రాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. అయినా సరే.. ఆ తర్వాత రంగి, గర్జనై లాంటి సినిమాల్లో నటించింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్’లో త్రిష పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న చిత్రంతో త్రిషనే కథానాయిక అన్నారు కానీ.. దాని గురించి క్లారిటీ లేదు.