మీడియాకు బండ్ల గణేష్ వేడుకోలు

మీడియా వాళ్లను చూసి మీకో దండం.. నన్నొదిలేయండి బాబోయ్ అంటూ దండం పెట్టేశాడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను మంగళవారం హైదరాబాద్‌లో విచారించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ సైతం విచారణ జరుగుతున్న కార్యాలయానికి వచ్చాడు.

ఆ ఆఫీస్ నుంచి గణేష్ బయటికి వస్తుండటం చూసి మీడియా వాళ్లు పెద్ద ఎత్తున ఆయన్ని చుట్టుముట్టారు. మీరెందుకొచ్చారిక్కడికి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఐతే బండ్ల గణేష్ వారికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. పూరి జగన్నాథ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సాయంత్రం అయినా ఆయన బయటికి రాలేదని తెలిసి ఆయన్ని కలుద్దామని మాత్రమే తాను ఇక్కడికి వచ్చానని.. అంతకుమించి తనకు ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేదని చెబుతూ అమ్మతోడు అంటూ నెత్తిన చెయ్యి పెట్టుకున్నాడు బండ్ల.

పూరీతో మీరు ఇంతకుముందు రెండు సినిమాలు నిర్మించారు కదా దాని గురించి ఈడీ అధికారులు ప్రశ్నించారా.. ఇంతకుముందు మీరు పూరీకి రూ.40 లక్షల ఖరీదైన వాచ్ ఇచ్చారు కదా దాని గురించి అడిగారా అని మీడియా వాళ్లు ప్రశ్నిస్తుంటే.. అసలు నన్ను వాళ్లు లోపలికి రానిస్తే కదా ఏమైనా అడగడానికి అని ఎదురు ప్రశ్నించాడు బండ్ల.

మీడియా వాళ్లు ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలేస్తుంటే.. ‘‘మీ మీడియా వాళ్లకో దండం. మీరనుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి నన్నొదిలేయండి మహా ప్రభో’’ అంటూ అక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు బండ్ల గణేష్. కాగా ఈడీ అధికారుల విచారణ సందర్భంగా పూరి.. 2015 నుంచి తన బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ సమర్పించినట్లు తెలుస్తోంది.