తాలిబన్ల చేతిలో అఫ్ఘన్, కల్వకుంట్ల చేతిలో తెలంగాణ – షర్మిల

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది. తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్ధాన్ చిక్కుకున్నట్లుగా ఏడేళ్ళుగా తెలంగాణ కల్వకుంట్ల వారి చేతుల్లో ఇరుక్కున్నట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోంది. కల్వకుంట్ల వారి చేతిలో అంటే కేసీయార్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసీఆర్ ఇంటిపేరు కల్వకుంట్ల అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అంటే కేసీయార్-తాలిబన్లు ఒకటే అన్న అర్ధము వచ్చేట్లుగా షర్మిల తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు.

సెప్టెంబర్ 2వ తేదీన తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని తల్లి విజయమ్మ ఒకవైపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ఒకపుడు వైఎస్ క్యాబినెట్లో ఉన్న మంత్రులతో పాటు సన్నిహితులు, మద్దతుదారులందరినీ పిలిచారు. పైకి ఇది రాజకీయాలతో సంబంధం లేని కార్యక్రమమే అని చెప్పినా రాజకీయ నేతలను పిలిచిన తర్వాత సదరు కార్యక్రమం రాజకీయం కాకమరేవతుంది ?

సెప్టెంబర్ 2వ తేదీ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారనే విషయంలో సస్పెన్సు కంటిన్యూ అవుతుంటే తాజాగా కేసీయార్ ను పట్టుకుని షర్మిల తాలిబన్లతో పోల్చటం సంచలనంగా మారింది. షర్మిల తాజా వ్యాఖ్యలు సెప్టెంబర్ 2వ తేదీన సమావేశంపై కచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉందనే ప్రచారం మొదలైపోయింది. షర్మిల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

గజ్వేల్ నియోజకవర్గంలోని అనంత రావులపల్లి ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి కొప్పు రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తర్వాత నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం, ఉద్యోగుల భర్తీ కోసం షర్మిల నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడినపుడే తెలంగాణా ప్రజలు కేసీయార్ పాలనలో ఆగమాగమౌతున్నట్లు మండిపోయారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో నిరుద్యోగులంతా నామినేషన్లు వేయాలని మరోసారి పిలుపిచ్చారు. నామినేషన్లు వేసే నిరుద్యోగులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇఛ్చారు. అయితే అండగా ఉంటుందంటే ఏ విధంగానో మాత్రం చెప్పలేదు.