రూ.7వేల కోట్ల అప్పుకు ఏపీ సర్కారు అలా చేస్తుందా?

అప్పుల తిప్పలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూ వేధిస్తున్నాయి. తలకు మించిన సంక్షేమ పథకాల అమలుతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. అప్పుల మీద అప్పులు తీసుకొస్తూ బండి నడిపే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా రూ.7వేల కోట్ల అప్పు కోసం పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రంగంలోకి దిగింది. అయితే.. ప్రభుత్వం ఇచ్చే కొత్త గ్యారెంటీకి అవకాశం లేకున్నా.. ఫైలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా గత ఆర్థిక సంవత్సరంలోని ఆదాయంలో 90 శాతాన్ని గ్యారెంటీ పరిమితిగా ఇచ్చే వీలుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం రూ.1.20 లక్షల కోట్లు. అంటే అందులో 90 శాతం అంటే రూ.1.06 లక్షల కోట్లన్న మాట. మార్చి 31 నాటికే ప్రభుత్వం రూ.1.19లక్షల కోట్ల రుణాన్ని గ్యారెంటీగా తీసుకొచ్చింది. ఇందులో రూ.1.13 లక్షల కోట్లను వాడేసింది. అంటే.. గ్యారెంటీల పరిమితిని దాటి అదనంగా రూ.7వేల కోట్లను అధికంగా వాడేశారు.

తాజాగా మరో రూ.7వేల కోట్లు అప్పుగా తేవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వాలు చేసే అప్పులకు సహకారం అందించకూడదనంటూ ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు.. ఆర్ బీఐ ఇచ్చిన ఆదేశాల్ని బ్యాంకులు ఏ మాత్రం సీరియస్ గా తీసుకోకపోవటం కూడా ఇప్పుడు చర్చగా మారింది.

ఇంత జరుగుతున్నా.. తాజాగా మరో రూ.7వేల కోట్ల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఏపీలో ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం కన్ను వేసిన వేళ.. తాజా రూ.7వేల కోట్లు తీసుకురావటం సాధ్యమవుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.