జామురాతిరి జాబిలమ్మ పాట ఎలా పుట్టిందంటే…..

అందరికీ తెలిసిన ఈ పాట క్షణక్షణం లోది.. ఇది ఎంత పెద్ద హిట్ సాంగో సంగీతాభిలాషులందరికీ తెలుసు.. దీని పుట్టు పూర్వోత్తరాలు చెబుతాను..

రామ్ గోపాల్ వర్మ మొదటి సినిమా శివ ప్రారంభం కావడానికి ముందే కీరవాణి తో మ్యూజిక్ చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. ఆ విషయం కీరవాణి కి కూడా చెప్పాడు.. అంతా రెడీ చేసుకున్నాక ప్రొడ్యూసర్స్ కి చెబితే వాళ్ళు కొంచం భయపడి.. నువ్వు ఫస్ట్ డైరక్షన్ చేస్తున్నావ్.. ఎవరైనా ఎస్టాబ్లిషెడ్ మ్యూజిక్ డైరక్టర్ అయితే బాగుంటుంది అని సూచించారు.. Rgv అప్పటికి అంత కమాండ్ రాలేదు కాబట్టీ తనికిష్టమైన ఇళయరాజాని ఎంచుకున్నాడు..

ఆ సమయం లోనే కీరవాణి ని కలిసి విషయం అంతా చెప్పి నెక్స్ట్ సినిమాకి మీరే మ్యూజిక్ డైరక్టర్ అని మాట ఇచ్చాడు.. శివ సూపర్ హిట్ అవ్వడం వెంటనే దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద క్షణక్షణం ప్రారంభానికి ముందే కీరవాణి మ్యూజిక్ డైరక్టర్ అని నిర్మాతలకు చెప్పేసాడు.. అప్పటికి తన కమాండింగ్ లెవల్ కూడా పెరిగింది కాబట్టీ వాళ్ళు వెంటనే సరే అన్నారు.. ఆలా కీరవాణి క్షణక్షణం లోకి ఎంటర్ అయ్యాడు..

ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్.. హోటల్ సవేరా లో స్వీట్ రూమ్ తీసుకుని అందులో ఏర్పాటు చేసాం.. కీరవాణి. ఆయన అసిస్టెంట్ తో పాటు ఒక పదకొండు పెన్నెండేళ్ల ఒక పాప కూడా వచ్చింది.. కీరవాణి కీ బోర్డు మీద ట్యూన్ హమ్ చేసాడు ఒకసారి రెండుసార్లు.. తర్వాత ఆ పాప ని హమ్ చేయమన్నాడు.. ఆమె ట్యూన్ ఆలపించింది.. ఒన్స్ అగైన్ అన్నాడు రాము.. మళ్ళీ ఆలపించింది.. అప్పటివరకు కళ్ళు మూసుకుని వింటున్న రాము తను కూడా ట్యూన్ హమ్ చేసి ఓకే అన్నాడు.. ఇప్పుడు ఇంకో ట్యూన్ చేస్తాను అని కీరవాణి కీ బోర్డు మీద ప్లే చెయ్యబోతుంటే రాము.. అవసరం లేదు.. ఇదే ఓకే అన్నాడు.. లేదండీ ఇంకో రెండు ట్యూన్స్ విని అప్పుడు డిసైడ్ చెయ్యండి అన్నాడు కీరవాణి… చెబుతున్నాను కదా.

నాకు ఇది ఒకే.. మీరు ఇంకో వంద ట్యూన్స్ చేసినా కూడా నాకు ఇదే నచ్చుతుంది అని ఖరాఖండీ గా చెప్పేసాడు.. తర్వాత దానికి సీతారామశాస్త్రి సాహిత్యం రాసాడు.’ జాము రాతిరి జాబిలమ్మ.. జోలపాడనా ఇలా… ‘.. సాంగ్ రికార్డింగ్ అయ్యాక ఆ పాప ట్రాక్ పాడింది.. తర్వాత చిత్ర పాడింది.. చివరి రెండు లైన్స్ మాత్రం బాలుగారు పాడారు.. ఆ కంపోజింగ్ కి వచ్చిన అమ్మాయి.. ట్రాక్ పాడిన అమ్మాయి ఇప్పుడు మ్యూజిక్ డైరక్టర్ కం సింగర్ mm శ్రీలేఖ…ఆలా సాంగ్ రికార్డింగ్ పూర్తయ్యాక..

ఇప్పుడు షూటింగ్.. ఒరిజినల్ ఫారెస్ట్ లో నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ చేయడం చాలా కష్టం.. పైగా శ్రీదేవి వెంకటేష్ ల లాంటి స్టార్ లతో.. అప్పుడు ఆర్ట్ డైరక్టర్ ‘బిజోన్ దాస్ గుప్తా’ అనే ఆర్ట్ డైరక్టర్ ని బొంబాయి నుండి రప్పించి అతనికి ఆ పని అప్పగించాం.. అన్నపూర్ణ స్టూడియో రెండవ ఫ్లోర్ లో ప్లాన్ చేసాం.. ఒక వారం రోజులు పాటు రాత్రియంబవళ్ళు కూర్చుని ఫినిష్ చేసాడు.. పెద్ద పెద్ద ట్రన్క్స్ మాత్రం మౌల్డ్ చేయించి మిగతా చెట్లన్నీ నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి తెప్పించారు.. దట్టంగా వున్న అడవి.. మధ్య లో నీటి కొలను.. గోపాలరెడ్డి అద్భుతంగా లైట్ అప్ చేసాడు.. నీటి కొలను లో వెన్నెల కిరణాలు పడుతున్నట్టు.. దాని ఎఫెక్ట్ శ్రేదేవి ఫేస్ మీదకు వచ్చేలా.. చాలా బాగా లైటింగ్ చేసాడు..

మూడు రోజులు షూటింగ్.. ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు.. మరల రాత్రి వాడిపోయిన కొన్ని చెట్లని మార్చటం.. కొలనులో నీరు తీసి తిరిగి ఫ్రెష్ వాటర్ నింపడం.. దీనికి కొరియోగ్రఫీ సుందరం మాష్టర్.. నిజానికి ఆయన పాత్ర చాలా తక్కువ.. రామూ నే కొరియోగ్రాఫర్ అని చెప్పవచ్చు.. శ్రీదేవి వెంకటేష్ ఒకే చోటులో కూర్చుని వుంటారు.. కెమెరా మాత్రం రకరకాల మూమెంట్స్ తో వాళ్లిద్దరూ ఓకే చోట కూర్చుని వున్నారు అనే ఫీలింగ్ లేకుండా చేస్తుంది.. అప్పటికి ‘జిమ్మీ జిబ్’ అనే క్రేన్ రాలేదు.. కేవలం సినీజీప్ అనే క్రేన్ ని మాత్రమే వాడాం.. మొత్తం పాటని రాము నే డిజైన్ చేసాడు.. ఆలా జామురాతిరి జాబిలమ్మ పాట ఇప్పటికీ కొత్తగా కనిపించటానికి ఇవన్నీ కారణాలు..ఈ పాటకు క్రెడిట్ తీసుకోవాల్సిన వాళ్ళు.. కీరవాణి.. సీతారామశాస్త్రి.. చిత్ర.. Spb.. బిజోన్ దాస్ గుప్తా.. వెంకటేష్.. శ్రీదేవి.. రామ్ గోపాల్ వర్మ.. బ్రెయిన్ రామూ ది అయినప్పటికీ ఇది ఓక సమిష్టి కృషి…

— శివ నాగేశ్వర రావు