‘ఏకే’ రీమేక్.. తప్పుకున్న హీరో!

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోశియుమ్’ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, రానా నటిస్తోన్న దీనికి ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమిళ రీమేక్ కి సంబంధించిన ఎలాంటి ఊసు లేదు. మొదట్లో శరత్ కుమార్-శశి కుమార్ నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత కార్తీ-పార్తిబన్ కాంబో తెరపైకి వచ్చింది. ఒక దశలో సూర్య-కార్తీ కలిసి సినిమాలో నటిస్తారంటూ బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటివరకు తమిళంలో ఈ రీమేక్ ముందుకు కదలడం లేదు. ఇక ఈ సినిమా హిందీ హక్కులను ప్రముఖ హీరో జాన్ అబ్రహం కొనుగోలు చేశారు.

సినిమాను నిర్మించడంతో పాటు తను కూడా ఒక పాత్రలో నటించే ఉద్దేశంతో జాన్ అబ్రహం ఈ సినిమాను ఎంచుకున్నారు. రెండో పాత్ర కోసం అభిషేక్ బచ్చన్ ను ఎంచుకున్నారు. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు అభిషేక్ ఈ రీమేక్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కారణం ఏంటనేది తెలియనప్పటికీ అభిషేక్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నది మాత్రం నిజం. దీంతో ఇప్పుడు మరో హీరో కోసం వెతుకులాట మొదలుపెట్టారు జాన్ అబ్రహం.