తెలంగాణ‌లో టీడీపీ లేదు, బాబుకు ప‌నిలేదు! .. రేవంత్ హాట్ కామెంట్స్‌

Revanth Reddy

రేవంత్‌రెడ్డి. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు. అదేస‌మ‌యంలో ఆయ‌న రాజ‌కీయంగా అడుగులు వేసింది.. టీడీపీ నుంచే. అంతేకాదు.. త‌న‌కు రాజ‌కీయ భిక్ష పెట్టింది కూడా చంద్ర‌బాబేన‌ని ఆయ‌న ప‌దేప‌దే చెప్పుకొన్నారు కూడా! అయితే.. తాజాగా రేవంత్ రెడ్డి.. అదే టీడీపీపైనా.. అదే చంద్ర‌బాబుపైనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు తెలంగాణ‌లో టీడీపీనే లేద‌ని.. ఆయ‌న చెప్ప‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్మ‌యం వ్య‌క్తం చేస్తోంది. ఒక‌వైపు.. టీడీపీని ప‌రిపుష్టం చేసేందుకు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లోనే ఉండి మంత్రాంగం చేస్తున్న నేప‌థ్యంలో.. తాజాగా రేవంత్ చేసిన హాట్ కామెంట్లు టీడీపీ అభిమానుల‌ను హ‌ర్ట్ చేశారు.

ఏం జ‌రిగిందంటే..

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణ స‌ర్కారుపైనా, సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జ‌గ‌న్‌పైనా విమర్శలు గుప్పించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, త్రీటైమ్స్ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. చంద్ర‌బాబుపై అనూహ్య వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణలో చంద్రబాబుకు పార్టీ లేద.. ప్రణాళిక లేదు అని రేవంత్రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

టీడీపీ నుంచి అందుకే బ‌య‌ట‌కు!

తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికే టీడీపీ నుంచి బయటకు వచ్చానని వివరించారు. రాజకీయ విలువను గౌరవిస్తున్నానన్న రేవంత్.. చంద్రబాబును తాను.. ఎందుకు తిట్టాలని ప్రశ్నించారు. తిట్టలేదు కాబట్టి తనను బాబు మనిషి అంటున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని రాజశేఖరరెడ్డి ని తిట్టి.. జగన్తో సఖ్యతగా ఉంది మీరు కాదా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. జగన్నుకు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ ఆహ్వానించిన విషయాన్ని గుర్తుచేశారు.

బాబుకు తెలంగాణ‌లో సంబంధం లేదు!

తెలంగాణతో చంద్ర‌బాబుకు సంబంధం లేద‌ని.. రేవంత్ రెడ్డి అన్నారు. ఏ సంబంధంలేని చంద్రబాబును తాను ఎందుకు తిట్టాల‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ కష్టాలకు కారణమైన కేసీఆర్ను తిట్టాలా? అని ప్ర‌శ్నించారు. అందుకే వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. నేను సోనియాగాంధీ మనిషిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. టీఆన్ ఎస్‌కు నువ్వు అధ్యక్షుడివి అయితే.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీ అధ్యక్షుడిని నేను. పీసీసీ అధ్యక్షుడిని అని గర్వంగా ఫీల్ అవుతా అని రేవంత్రెడ్డి నిప్పులు చెరిగారు.

జ‌గ‌న్‌తో చేతులు క‌లిపింది నువ్వే!

జగన్తో అలయ్బలయ్ చేసుకుంది కేసీఆర్ కాదా అని రేవంత్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి భోజనం చేసి.. రాయలసీమకు నీళ్లిస్తా అని చెప్పింది కేసీఆరే కదా అని మండిపడ్డారు. బేసిన్లు బేషజాలు లేవంటూ జగన్తో సఖ్యతగా సీఎం కేసీఆర్ మెలిగారంటూ రేవంత్ గుర్తు చేశారు. బేసిన్లు, బేషజాలు లేకుంటే ఇంతమంది తెలంగాణ పౌరుల ఆత్మబలిదానాలు ఎందుకు? రాష్ట్రం తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా అంటూ ప్రశ్నించారు.

అందుకే నాకు పీసీపీ ప‌ద‌వి!

త‌న‌కు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి రావ‌డంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా రేవంత్ చెక్ పెట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టి విజయవంతం చేయటం ద్వారానే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు తనపై ఓ నమ్మకం ఏర్పడిందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డిని నియమిస్తే.. కాంగ్రెస్ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేసుకుంటారన్న భరోసా వారికి ఏర్పడిందని తెలిపారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడాలని జిల్లా రైతాంగమంతా కదిలొచ్చిన విషయం కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడిందన్న రేవంత్రెడ్డి.. రైతులంతా కదిలొచ్చి రాజీవ్ రైతు దీక్షను విజయవంతం చేయడంతోనే తనకు పీసీసీ పదవి వచ్చిందని స్పష్టం చేశారు.