విశాఖ రాజధాని కాదు.. కేంద్రం సవరణ..!

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనగానే ఎవరైనా అమరావతి అని చెప్పేవారు. అయితే.. జగన్ సర్కార్ మాత్రం విశాఖ ను ప్రధాన రాజధానిగా మార్చాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సడెన్ గా.. కేంద్ర ప్రభుత్వం.. విశాఖను ఏపీ రాజధానిగా పేర్కొంటూ కామెంట్స్ చేసింది. దీంతో.. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తీవ్ర చర్చకు దారితీసింది. అందుకే.. వెంటనే కేంద్రం తాను చేసిన పొరపాటును సరిచేసుకుంది.

ఏపీ క్యాపిటల్‌ విశాఖ కాదని క్లారిటీ ఇచ్చింది. విశాఖ కేవలం ఏపీలోని ఓ నగరం మాత్రమేనని స్పష్టంగా చెప్పింది. పెట్రోలియం ట్యాక్స్‌లకు సంబంధించిన రిప్లైలో విశాఖ పేరును మాత్రమే ఉదహరించామని చెప్పుకొచ్చింది. హెడ్డింగ్‌లో రాజధాని అని ఉన్న చోట విశాఖ అని రాయడం వల్ల ఈ తప్పిదం జరిగినట్టు కేంద్రం ఒప్పుకుంది. జులై 26న లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా కేంద్రం సమాధానమిచ్చింది. అయితే, ఏపీ రాజధాని విశాఖ అని చెప్పటం తమ ఉద్దేశం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

పెట్రో ధరల పెరుగుదల వల్ల దేశంపై పడుతున్న ప్రభావం, వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఇందులో వివిధ రాష్ట్రాల పేర్లు, దాని పక్కనే రాజధాని అని ఉన్న చోట విశాఖ అని పెట్టి.. రిప్లై ఇచ్చింది. ఒక్క విశాఖనే కాదు హర్యానా రాజధాని అంబాలా అని, పంజాబ్‌కు జలంధర్‌ అని పెట్టి పంపించింది కేంద్రం.

దీంతో సోషల్ మీడియాలో రాజధానులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేంద్రం తీరుపై సెటైర్లు కూడా వేశారు. ఆలస్యంగానైనా స్పందించిన కేంద్రం ఈ తప్పును సరిదిద్దుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీంతో తప్పును సరిదిద్దుకున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది. సమాధానంలోని రాజధాని అన్న హెడ్డింగ్‌ కింద ఇచ్చిన నగరాలను కేవలం ఆ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో విధిస్తున్న పన్నుల గురించి చెప్పడానికి నిర్దేశించామని వెల్లడించింది. ఆ హెడ్డింగ్‌ను కేవలం రాజధాని అని మాత్రమే కాకుండా రాజధాని లేదా రిఫెరెన్స్‌ సిటీగా చదువుకోవాలని కోరుతున్నామని తెలిపింది. ఈ మేరకు మార్పు చేసి లోక్‌సభ సచివాలయానికి తెలిపామని పెట్రోలియం శాఖ పేర్కొంది.